Rafale fighter jets: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక దళానికి చెందిన రాఫెల్ ఫైటర్ జెట్లు అద్భుతంగా పనిచేశాయని, మొత్తం ఆపరేషన్లో రాఫెట్ ఫైటర్ జెట్లు ‘‘హీరో’’ అని భారత ఎయిర్ఫోర్స్ వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ బుధవారం అన్నారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ మరిన్ని మల్టీ రోల్ ఫైటర్ జెట్లను చేర్చుకోవాలని లక్ష్యం పెట్టుకుందని ఆయన చెప్పారు.
Read Also: Rahul Gandhi: రాహుల్గాంధీపై కేంద్రం సంచలన నిర్ణయం..
ఎక్సర్సైజ్ వాయుశక్తి 2026 ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రతీ ఉగ్రవాద చర్యకు ప్రతిస్పందిస్తామని ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ అన్నారు. “ఆపరేషన్ సిందూర్ సమయంలో రాఫెల్ ఖచ్చితంగా హీరో. భారత వైమానిక దళం మల్టీరోల్ ఫైటర్ జెట్లను చేర్చుకోవాలని ఎదురుచూస్తోంది. ఇవి రాఫెల్ లేదా మరేదైనా కావచ్చు, ఇవి చర్చల్లో ఉన్నాయి, ఇంకా నిర్దిష్ట నిర్ణయం తీసుకోలేదు.” అని ఆయన అన్నారు. భారత్పై జరిగే ఏ ఉగ్రవాద దాడికైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే అని హెచ్చరించారు. భారత్ ఫ్రాన్స్తో 114 రాఫెల్ ఫైటర్ జెట్స్ డీల్ కుదుర్చుకోబోతోందనే వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.
గతేడాది భారత్పై లష్కరే తోయిబా ఉగ్రసంస్థ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో పర్యాటకుల్ని టార్గెట్ చేసి 26 మందిని చంపేసింది. దీని తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాకిస్తాన్, పీఓకేలోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలను టార్గెట్ చేసి దాడులు చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్ సైన్యం దాడులకు ప్రయత్నిస్తే, భారత్ పాకిస్తాన్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడింది. రాఫెల్ జెట్లు, స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబులను ఉపయోగించి పాక్లో విధ్వంసం సృష్టించింది.
