ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూలో 2 రోజుల పాటు నిర్వహించాల్సిన “నవ సంకల్ప్ కార్యశాల”లో పాల్గొనడానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వెళ్లారు. అయితే.. ఉన్నట్టుండి.. ఉత్తరప్రదేశ్ పర్యటనను ముగించుకొని ఢిల్లీకి తిరిగివెళ్లారు. గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలతో పాటు పార్టీని రాష్ట్రంలో బలపర్చే అంశాలపై కీలక చర్చల్లో ప్రియాంక గాంధీ పాల్గొనాల్సి ఉంది. అయితే.. ఆమె ఒక్కసారిగా ఢిల్లీకి ఎందుకు వెళ్లారన్న విషయం ఆ పార్టీ యూపీ నేతలకు కూడా తెలియకపోవడంతో నేతల్లో ఆయోమయం నెలకొంది. లఖ్నవూకు ప్రియాంక గాంధీ బుధవారం ఉదయం చేరుకున్నారు.
గురువారం జరగాల్సిన సమావేశంలో పాల్గొనకుండానే ఆమె ఢిల్లీకి తిరిగి వెళ్లారని యూపీ కాంగ్రెస్ మీడియా వైస్ ఛైర్మన్ ప్రకాశ్ శ్రీవాత్సవ కూడా వెల్లడించారు. అయినప్పటికీ, “నవ సంకల్ప్ కార్యశాల” సమావేశాన్ని పార్టీ ఇతర నేతలతో కలిసి కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి నిన్న వైద్య పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆ పార్టీ నేత రణ్దీప్ సుర్జేవాలా ప్రకటించిన విషయం విధితమే.