మహారాష్ట్రలో రెండో అతి పెద్దనగరం పూణెలో మెట్రోరైలు సేవలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ ఆదివారం నాడు పూణె మెట్రోరైలు ప్రాజెక్టును ప్రారంభించారు. తొలుత పుణె మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. 9.5 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని పూణె మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అనంతరం గర్వారే మెట్రో స్టేషన్కు చేరుకున్న ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపి పూణె మెట్రో రైలు ప్రాజెక్ట్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ టిక్కెట్ కొనుక్కొని మరీ రైలులో ప్రయాణించారు. గర్వారే మెట్రో స్టేషన్ నుంచి ఆనంద్ నగర్ స్టేషన్ వరకు సామాన్యులతో కలిసి మోదీ ప్రయాణం చేశారు. కాగా పూణె మెట్రో రైల్ ప్రాజెక్టుకు 2016 డిసెంబర్ 24న శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్టు అంచనా రూ 11,440 కోట్లు. సిటీలో మొత్తం 32.2 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైల్ నిర్మితమవుతుండగా తొలి 12 కిలోమీటర్ల మార్గాన్ని ఆదివారం నాడు ప్రధాని మోదీ ప్రారంభించారు.