PoK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)పై దాడి చేయాలని ప్రధాని నరేంద్రమోడీకి పీఓకే శరణార్థులు లేఖ రాశారు. ఇటీవల వెనిజులాపై అమెరికా దాడి చేసినట్లే, పీఓకేకు విముక్తి కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. పీఓకే నుంచి నిరాశ్రయులైన వ్యక్తులు, పీఓకే ప్రాంతంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై నిర్ణయాత్మక, సాహసోపేత దాడిని ప్రారంభించాలని ప్రధానిని కోరారు. పీఓకే శరణార్థులకు ప్రాతినిధ్యం వహిస్తున్న SOS ఇంటర్నేషనల్ సంస్థ ప్రధాని మోడీకి ఈ లేఖ రాసింది.
Read Also: 2.8K డిస్ప్లే, Dimensity 7300 Max, 12,200mAh బ్యాటరీతో Realme Pad 3 భారత్లో లాంచ్..!
పీఓకే ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేసి హిజ్బుల్ ముజాహీదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ను పట్టుకోవడానికి సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆ సంస్థ చైర్మన్ రాజీవ్ చుని అన్నారు. వెనిజులాలో అమెరికా ఆపరేషన్, అధ్యక్షుడు నికోలస్ మదురోను ఉదాహరణగా చూపుతూ, భారత దళాలు సలావుద్దీన్ను పట్టుకుని, బంధించి, భారతదేశానికి తీసుకురావాలని తాను కోరుకుంటున్నానని చుని అన్నారు. పీఓకేను ఉగ్రవాదులు, డ్రగ్స్, ఆయుధాలకు లాంచ్ ప్యాడ్స్గా ఉపయోగిస్తున్నారని, ఇది భారత భద్రతకు ముప్పుగా ఉందని ఆయన చెప్పారు. అంతర్జాతీయ సమస్యల కన్నా జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పీఓకేను విముక్తి చేసి, దానిని భారత్లో కలపాలని లేఖలో కోరారు.