PM Modi: మిడిల్ ఈస్ట్లో అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం రాజ్యసభలో అన్నారు. వివాదాన్ని పరిష్కరించేందుకు చర్చల మార్గాన్ని అనుసరించాలని భారత్ సూచించింది. ఈ యుద్ధ ప్రభావం దీర్ఘకాలికంగా కొనసాగుతుందని ప్రధాని హెచ్చరించారు. ముఖ్యంగా ‘‘హార్ముజ్ జలసంధి’’లో ఇరుక్కుపోయిన నౌకలు, అందులోని భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఇరాన్ యుద్ధం మూడు వారాలుగా కొనసాగుతోందని, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఇంధన సంక్షోభం ఏర్పడిందని మోడీ సభలో చెప్పారు. గల్ఫ్ దేశాల్లో సుమారు 1 కోటికి మంది భారతీయలు వివిధ పనులు చేస్తున్నారని, వీరి ప్రాణాలకు భారత్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్, గల్ఫ్లోని తన మిత్రదేశాలతో పాటు ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తుందని వెల్లడించారు. యుద్ధాన్ని ఆపేందుకు దౌత్యం, చర్చలు జరపాలని సూచించినట్లు చెప్పారు. ప్రజలు, మౌలిక సదుపాయాలపై దాడుల్ని భారత్ తీవ్రంగా ఖండించినట్లు వెల్లడించారు.
భారత్కు తగినన్ని ఇంధన నిల్వలు ఉన్నట్లు చెప్పారు. గత 11 ఏళ్లలో 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల వ్యూహాత్మక నిల్వల్ని ఏర్పాటు చేశామని, భారత్ 41 దేశాల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నట్లు, ఒకే దేశంపై ఆధారపడి లేమని వెల్లడించారు. భారత్ ట్రేడ్ 90 శాతం విదేశీ నౌకలపై ఆధారపడుతోందని దీనిని తగ్గించేందుకు రూ. 70,000 కోట్ల ప్రాజెక్టు ప్రారంభించామని, స్వదేశీ నౌకల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాజ్యసభలో అన్నారు. అవసరమైన వస్తువులు, నిల్వల్ని నిరంతరం పరిశీలించాలని, ఎక్కడైనా అక్రమ నిల్వలు కనిపిస్తే చర్యలు తీసుకోవాలని ప్రధాని రాష్ట్రాలకు సూచించారు. కానీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, ఈ ప్రభావాన్ని అంచనా వేసేందుకు మంత్రులతో ఒక టీం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎల్పీజీ, పీఎన్జీ వినియోగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.