PM Modi: ఆస్ట్రేలియాలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన కొనసాగుతోంది. గురువారం ఆయన మెల్బోర్న్లో ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశ స్వదేశీ రక్షణ సామర్థ్యాలు ప్రపంచ గుర్తింపును పొందాయని, దేశ సైనిక బలానికి ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిదర్శనమని అన్నారు. ఉగ్రవాద శిబిరాల్లో పేలుళ్ల శబ్ధాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించాయని, ఆ సమయంలో భారత సంకల్పాన్ని ప్రపంచం మొత్తం చూసిందని ప్రధాని చెప్పారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం ప్రతిస్పందించిన విషయాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు. భారతదేశ రక్షణ వ్యవస్థల సామర్థ్యాన్ని, విశ్వసనీయతను ప్రపంచం చూస్తోంది అని మార్వెల్ స్టేడియంలో జరిగిన సభలో అన్నారు. ‘‘ఆపరేషన్ సింధూర్ సమయంలో, ఉగ్రవాదుల స్థావరాలపై జరిగిన పేలుళ్లను మీరు చూసే ఉంటారు. ఆ పేలుళ్ల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. ఉగ్రవాద శిబిరాలపై అలాంటి నిర్ణయాత్మక దాడి జరిగినప్పుడు, మీకు గర్వంగా అనిపించలేదా?’’ అని ప్రశ్నించినప్పుడు సభలోని భారతీయులు ఒక్కసారిగా చప్పట్లు, నినాదాలతో స్పందించారు.
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా స్థిరంగా పయనిస్తోందని మోడీ చెప్పారు. ఒక కల నెరవేరినప్పుడు మరొకటి పుడుతుంది, ఒక లక్ష్యాన్ని సాధించడం మరింత గొప్ప సంకల్పానికి దారి తీస్తుంది. ఇది ‘‘గ్రో మోర్’’, ‘‘అచీవ్ మోర్’’ అని నమ్మే భారతదేశం అని అన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందన్ని, వీలైనంత త్వరగా ప్రపంచంలో మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని ప్రధాని అన్నారు. భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5జీ మార్కెట్గా ఉందని, భారత్ ‘‘మేడ్ ఇన్ ఇండియా’’ 6జీ సాంకేతికపై వేగంగా పనిచేస్తోందని చెప్పారు.

