పద్మ అవార్డులు కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రధాని మోడీని మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆయన కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా కలిశారు. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మమ్ముట్టికి దేశంలోని మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్ ప్రదానం చేయబడింది. అనంతరం ప్రధాని మోడీతో కలిసి మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ కుటుంబ సమేతంగా ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
పద్మ భూషణ్ స్వీకరించేందుకు మమ్ముట్టితో పాటు ఆయన భార్య సుల్ఫత్, కుమార్తె సురుమి, కుమారుడు దుల్కర్ సల్మాన్ రాష్ట్రపతి భవన్కు హాజరయ్యారు. అవార్డు అందుకుంటున్న సమయంలో కుటుంబ సభ్యులు మమ్ముట్టిని అభినందించారు. కార్యక్రమం అనంతరం వారు ప్రధాని మోడీని కలుసుకుని ఆత్మీయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను ప్రధాని మోడీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. “ఈ రోజు పద్మ అవార్డుల కార్యక్రమం అనంతరం ప్రముఖ నటుడు మమ్ముట్టి, ఆయన కుటుంబ సభ్యులను కలిశాను” అని పేర్కొన్నారు.
ఒక ఫొటోలో మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ ఇద్దరూ ప్రధాని మోడీతో కలిసి చిరునవ్వులతో కనిపించగా..మరో ఫొటోలో మొత్తం కుటుంబం ప్రధాని వెంట నిలబడి ఫొటో దిగింది. ఈ పురస్కారంపై స్పందించిన మమ్ముట్టి సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. “పద్మ భూషణ్ పురస్కారం అందుకోవడం నాకు ఎంతో గౌరవంగా, వినమ్రతను కలిగించే విషయంగా భావిస్తున్నాను. నా సినీ ప్రయాణాన్ని గుర్తించి ఈ గౌరవం ఇచ్చిన భారత ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు.” అని తెలిపారు.

