Site icon NTV Telugu

Navya haridas: వయనాడ్ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడం ఆశ్చర్యపోయాను

Navyaharidas

Navyaharidas

దేశంలో మహారాష్ట్ర, జార్ఖండ్‌లో రెండు ప్రధానమైన అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే.. వయనాడ్ ప్రత్యేకంగా ఫోకస్ అవుతోంది. దీనికి ప్రధానంగా.. ఇక్కడ ప్రియాంక గాంధీ పోటీ చేయడమే కారణం. తొలిసారి ప్రియాంక ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఇక ప్రియాంకకు పోటీగా కమలనాథులు కూడా గట్టి అభ్యర్థినే నిలబెట్టారు. కౌన్సలర్ అయిన నవ్య హరిదాస్‌ను బీజేపీ రంగంలోకి దింపింది. ప్రియాంక బుధవారం నామినేషన్ వేయగా.. గురువారం నవ్వ నామినేషన్ దాఖలు చేసింది.

ఇది కూడా చదవండి: Vistara Airlines: “సారీ క్షమించండి”.. టాటా గ్రూపునకు చెందిన విస్తారా క్షమాపణలు..

ఈ సందర్భంగా నవ్య మాట్లాడుతూ… వయనాడు లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించడంపై తాను చాలా ఆశ్చర్యపోయానని చెప్పారు. తాను చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. గాంధీ కుటుంబం వయనాడ్‌లో కుటుంబ ఆధిపత్యాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే ప్రజలకు ఖచ్చితంగా దాని నుంచి మార్పు కావాలన్నారు. తాను దశాబ్ద కాలంగా రాజకీయాల్లో ఉన్నానని.. కోజికోడ్ కార్పొరేషన్ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధినిగా ఉన్నట్లు గుర్తుచేశారు. వయనాడ్ ప్రజల సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించడం లేదన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ నియోజక వర్గంలో సందర్శకులుగా మాత్రమే పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. గత 5 సంవత్సరాలుగా వారి తరపున మాట్లాడేవారు ఎవరూ లేరని చెప్పారు. అందుకే వయనాడు ప్రజలు ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారని నవ్య హరిదాస్ అన్నారు.

వయనాడ్ ఉపఎన్నిక పోలింగ్ నవంబర్ 13న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వయనాడ్ కింగ్ ఎవరో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

ఇది కూడా చదవండి: Justice Sanjiv Khanna: నవంబర్ 11న కొత్త సీజేఐ ప్రమాణస్వీకారం..

Exit mobile version