Parliament Monsoon Session 2026: నేటి నుంచి సజావుగా పార్లమెంట్ సమావేశాలు.. స్పీకర్ ఓం బిర్లా చొరవతో తొలగిన ప్రతిష్టంభన

  • నేటి నుంచి సజావుగా పార్లమెంట్ సమావేశాలు
  • నేడు 'పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు-2026'పై చర్చ
  • విద్యార్థులకు ఇచ్చిన హామీ అమలుపై ప్రభుత్వ దృష్టి
Parliament Monsoon Session

Parliament Monsoon Session

కొన్ని రోజులుగా వరుస వాయిదాలతో ప్రతిష్టంభనకు గురైన పార్లమెంట్ సమావేశాలు మంగళవారం నుంచి సజావుగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చొరవ తీసుకుని అధికార, ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లతో జరిపిన చర్చలు ఫలించడంతో సభ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగేందుకు మార్గం సుగమమైంది. సోమవారం వరుస వాయిదాల అనంతరం స్పీకర్ ఓం బిర్లా వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. సభ సజావుగా నిర్వహించేందుకు అన్ని పార్టీల సహకారం కోరగా, అందుకు నాయకులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

నేడు ‘పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు-2026’పై చర్చ

లోక్‌సభలో నేడు ‘పబ్లిక్ పరీక్షలు (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు-2026’పై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ బిల్లుపై చర్చకు మొత్తం ఆరు గంటల సమయాన్ని కేటాయించారు. అవసరమైతే మరింత సమయం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.

విద్యార్థులకు ఇచ్చిన హామీ అమలుపై ప్రభుత్వ దృష్టి

పోటీ పరీక్షల్లో పేపర్ లీకేజీలు, అక్రమాలు, కాపీయింగ్ వంటి ఘటనలను అరికట్టేందుకు ఈ బిల్లును తీసుకొచ్చిన ప్రభుత్వం, విద్యార్థులకు ఇచ్చిన హామీ మేరకు దీనిని ఉభయ సభల్లో ఆమోదింపజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విద్యార్థుల దీర్ఘకాల డిమాండ్‌కు అనుగుణంగా ఈ చట్ట సవరణను త్వరగా అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఆరు రోజులు వృథా.. ఇక మిగిలింది 13 రోజులు

మొత్తం 19 రోజుల పాటు జరగాల్సిన వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఇప్పటికే ఆరు రోజులు వరుస వాయిదాలతో వృథా అయ్యాయి. ప్రస్తుతం ఆగస్టు 13 వరకు ఇంకా 13 రోజుల సమావేశాలు మిగిలి ఉండటంతో కీలక బిల్లులను ఆమోదించేందుకు ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేసింది.

విద్యార్థులపై దాడి అంశంపై ప్రతిపక్షాల ఆందోళన

విద్యార్థులపై జరిగిన దాడి ఘటనను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీశాయి. నినాదాలు, నిరసనలతో సభను హోరెత్తించడంతో గత కొన్ని రోజులుగా సమావేశాలు సజావుగా సాగలేదు.

బిల్లులో కీలక నిబంధనలు

‘పబ్లిక్ పరీక్షలు (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు-2026’లో పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలను ప్రతిపాదించారు. పేపర్ లీకేజీలు, కాపీయింగ్, ఇతర మోసాలకు పాల్పడిన వారికి గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా బిల్లులో నిబంధనలు చేర్చారు. ఈ బిల్లును త్వరితగతిన ఉభయ సభల్లో ఆమోదింపజేసి దేశవ్యాప్తంగా ప్రభుత్వ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయతను పెంపొందించాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.