Pakistan: భారత్ చేసిన ఈ విషయాన్ని కూడా పాకిస్తాన్ కాపీ కొట్టింది..

  • భారత్ చేసే ప్రతీ విషయాన్ని కాపీ కొడుతున్న పాకిస్తాన్..
  • దౌత్య పర్యటనని కూడా కాపీ చేసిన దాయాది..
  • బిలావల్ భుట్టో ఆధ్వర్యంలో విదేశీ పర్యటనలు..
Bilawal Bhutto

Bilawal Bhutto

Pakistan: ఆపరేషన్ సిందూర్‌తో ఎయిర్ బేసుల్ని కోల్పోయినా పాకిస్తాన్‌కి బుద్ధి రావడం లేదు. తాము భారత్‌పై గెలిచామంటూ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ విజయోత్సవాలు చేసుకుంటున్నారు. వీటి ద్వారా పాకిస్తాన్ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, సంఘర్షణ తర్వాత భారత్ చేస్తున్న ప్రతీ విషయాన్ని పాకిస్తాన్ కాపీ కొడుతోంది. భారత్ ఏం చేస్తుందో, ఆ తర్వాత మేము కూడా అదే చేస్తామని పాకిస్తాన్ అంటోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని నరేంద్రమోడీ మన రక్షణ బలగాలకు మరింత ఆత్మ విశ్వాసం వచ్చేలా, పలు సైనిక స్థావరాలను సందర్శించారు. సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. దీని తర్వాత, పాక్ ప్రధాని కూడా ఇదే తరహాలో పాక్ సైనిక స్థావరాలను సందర్శించారు.

Read Also: Fire Accident : చార్మినార్ అగ్నిప్రమాదంపై స్పందించిన ఫైర్ డిపార్ట్‌మెంట్.. సకాలంలో చర్యలు తీసుకున్నాం

ఇదిలా ఉంటే, పాకిస్తాన్ తీరును, పాక్ ఉగ్రవాదానికి ఇస్తున్న మద్దతు గురించి తెలియజేయడం, ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి తెలియజేయడానికి భారత్ అఖిలపక్షంతో కూడిన 7 దౌత్య బృందాలను విదేశాలకు పంపుతోంది. ఆయా దేశాల్లో మన ప్రజాప్రతినిధులు భారత్ టెర్రరిజం పట్ల ‘‘జీరో టాలరెన్స్’’ విధానం గురించి చెబుతారు.

ఇప్పుడు దీనిని కూడా పాకిస్తాన్ కాపీ కొట్టింది. మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అధ్యక్షతన పాకిస్తాన్ శాంతి కోసం చేస్తున్న ప్రయత్నాలను వివరించేందుకు దౌత్య బృందాలను విదేశాలకు పంపుతున్నట్లు ఆ దేశం ప్రకటించింది. ఈ విషయాన్ని భుట్టో ఎక్స్ ద్వారా తెలియజేశారు. ‘‘ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నన్ను సంప్రదించారు. అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ శాంతి వాదనల్ని వివరించడానికి ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాలని అభ్యర్థించారు. ఈ బాధ్యత స్వీకరించడం, సవాలుతో కూడిన ఈ సమయంలో పాకిస్తాన్‌కి సేవ చేయడానికి కట్టుబడి ఉండటం నాకు గౌరవంగా ఉంది’’ అని అన్నారు.