కరోనా మహమ్మారి అన్ని రంగాలపై ప్రభావం చూపింది.. ఇక, విద్యారంగానికి సవాల్ విసిరింది.. ప్రత్యక్ష బోధన లేకపోవడంతో.. అంతా ఆన్లైన్కే పరిమితం కావాల్సిన పరిస్థితి.. దీంతో.. చాలా మంది విద్యార్థుల చదవులు అటకెక్కాయి.. కొంతమంది విద్యార్థులు పొలం పనుల్లో బిజీ అయ్యారు.. ఆన్లైన్ విద్య పేరుకు మాత్రమే అన్నట్టుగా తయారైంది.. కరోనా విలయం, లాక్డౌన్ ఆంక్షలతో స్కూలు విద్య బాగా దెబ్బతింది. అయితే, స్కూళ్ల పునర్ ప్రారంభంపై ఐసీఎంఆర్ సెక్రటరీ డాక్టర్ బలరామ్ భార్గవ కీలక సూచనలు చేశారు. ముందు ప్రాథమిక పాఠశాలలను తెరిస్తే మంచిదని సూచించారు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ను తట్టుకునే సామర్థ్యం చిన్నారులకు ఎక్కువగా ఉంటుందన్న ఆయన.. అయితే, టీచర్లందరికి వ్యాక్సినేషన్ పూర్తయితే స్కూళ్లు తెరవొచ్చని సూచనలు చేశారు.
అంతేకాదు.. సెకండరీ పాఠశాలలకంటే ముందు ప్రాథమిక పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం.. అయితే, స్కూళ్ల ప్రారంభం కంటే ముందుగానే పాఠశాలల బస్సు డ్రైవర్లు, ఉపాధ్యాయులు, పాఠశాలలోని ఇతర సిబ్బందికి కూడా వ్యాక్సిన్ అవసరం అన్నారు ఐసీఎంఆర్ డీజీ భార్గవ.. నిన్న ఎయిమ్స్ చీఫ్ కూడా తగు జాగ్రత్తలతో స్కూళ్ల ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. మొత్తంగా.. మళ్లీ విద్యార్థులను స్కూళ్లకు రప్పించేందుకే చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.