NTV Telugu Site icon

Afzal Guru: “అఫ్జల్ గురుని ఉరితీయడం వల్ల లాభం లేదు”.. ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..

Omar Abdullah , Afzal Guru,

Omar Abdullah , Afzal Guru,

Afzal Guru: జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి. 2001లో పార్లమెంట్‌పై దాడి చేసిన కేసులో ఉగ్రవాది అఫ్జల్ గురుని ఉరితీయడం వల్ల ఏం ప్రయోజనం లేదని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఫైర్ అవుతోంది.

‘‘ఒమర్ అబ్దుల్లా ఏం చెప్పాలనుకుంటున్నారు..? భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నిన దేశ వ్యతిరేక శక్తులకు మరణశిక్ష విధిస్తే, వారు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు..? వారు ఉగ్రవాదుల నుంచి మద్దతు తీసుకునే పరిస్థితిని సృష్టించాలనుకుంటున్నారు. అందుకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అని బీజేపీ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ఉపముఖ్యమంత్రి కవీందర్ గుప్తా అన్నారు.

Read Also: Sangareddy: భారీ వర్షాలతో సంగారెడ్డి అతలాకుతలం.. చెరువులను తలపిస్తున్న కాలనీలు

అంతకుముందు, అఫ్జల్ గురు ఉరిశిక్షకు సంబంధించి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ఈ ప్రక్రియలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదని ఆయన చెప్పారు. ఒక వేళ రాష్ట్ర ఆమోదం కావాలని కోరితే, మేము దానిని మంజూరు చేసే వాళ్లం దాని చెప్పారు. అతడిని ఉరితీయడం ద్వారా ఏదైనా ప్రయోజనం నెరవేరిందని నేను నమ్మడం లేదు అని అబ్దుల్లా శుక్రవారం అన్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఒమర్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 18,25, అక్టోబర్ 01న మూడు విడతల్లో జమ్మూ కాశ్మీర్‌లోని 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబర్ 08న ఫలితాలు వెలువడుతాయి. భారత ఎన్నికల సంఘం ప్రకారం.. జమ్మూ కాశ్మీర్లో 88.06 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసాగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.