Govt Pending BSNL Dues: ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)కు చెల్లించాల్సిన టెలిఫోన్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. 2025 డిసెంబర్ 31 నాటికి ఒడిశా ప్రభుత్వంలోని వివిధ శాఖలు, సంస్థలు కలిపి మొత్తం రూ.28.54 కోట్ల టెలిఫోన్ బిల్లులు బీఎస్ఎన్ఎల్కు చెల్లించాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీకి లేఖ రాసి, పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. ఇటీవల నెలల్లో ఇదే అంశంపై ఆయన ఇప్పటికే మూడుసార్లు రిమైండర్ లేఖలు పంపినప్పటికీ, ఇప్పటివరకు పూర్తిస్థాయిలో చెల్లింపులు జరగలేదని కేంద్రం పేర్కొంది.
ఆ లేఖలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇలా పేర్కొన్నారు.. “దేశవ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లో టెలికాం సేవలను అందించడంలో BSNL కీలక పాత్ర పోషిస్తోంది. సాయుధ దళాలు, ప్రభుత్వ విభాగాలు, బ్యాంకులు మరియు అనేక సంస్థలకు బీఎస్ఎన్ఎల్ సేవలు అత్యంత అవసరం” అని పేర్కొన్నారు. బలమైన నెట్వర్క్తో BSNL ప్రజలకు విశ్వసనీయ సేవలను అందిస్తోందని, అయితే సంస్థ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం 2019, 2022 మరియు 2023 సంవత్సరాల్లో పునరుద్ధరణ ప్యాకేజీలను ఆమోదించినట్టు తెలిపారు.
స్థిరమైన నగదు ప్రవాహం అవసరం
బీఎస్ఎన్ఎల్ కార్యకలాపాలు నిరవధికంగా కొనసాగాలంటే స్థిరమైన నగదు ప్రవాహం ఎంతో అవసరమని, ముఖ్యంగా టెలికాం మౌలిక సదుపాయాల ఆధునీకరణ కోసం బకాయిల సకాలంలో చెల్లింపులు చాలా కీలకమని సింధియా లేఖలో స్పష్టం చేశారు. ఇప్పటికే టెలికమ్యూనికేషన్ కార్యదర్శి కూడా ఈ బకాయిల చెల్లింపుపై ఒడిశా ప్రభుత్వాన్ని అభ్యర్థించారని పేర్కొన్నారు. ప్రజలకు సురక్షితమైన, విశ్వసనీయమైన టెలికాం సేవలు అందించాలంటే రాష్ట్ర ప్రభుత్వ శాఖలు తమ బిల్లులను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఏ శాఖకు ఎంత బకాయి?
ఒడిశా ప్రభుత్వ విభాగాల్లో సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ వద్ద అత్యధికంగా రూ.8.59 కోట్ల బకాయిలు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. దీని తర్వాత న్యాయ శాఖ రూ.4.42 కోట్ల టెలిఫోన్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. రూ.1 కోటి కంటే ఎక్కువ బకాయిలు ఉన్న ఇతర శాఖల్లో.. అంటే.. విద్య శాఖ, ఆర్థిక శాఖ, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ, గృహ నిర్మాణ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు ఉన్నాయి.
కొంత మేర తగ్గిన బకాయిలు
నవంబర్లో కేంద్ర మంత్రి సింధియా పంపిన రిమైండర్ లేఖ తర్వాత కొన్ని శాఖలు తమ పెండింగ్ బిల్లులను కొంత మేర చెల్లించినట్టు సమాచారం. ముఖ్యంగా ఆర్థిక శాఖ, సమాచార & ప్రజా సంబంధాల శాఖలు తమ బకాయిల్లో గణనీయమైన భాగాన్ని చెల్లించాయి. అయితే, మొత్తం పెండింగ్ టెలిఫోన్ బకాయిలు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. మే 2025 నాటికి ఒడిశా రాష్ట్రంలో మొత్తం చెల్లించని టెలిఫోన్ బిల్లులు సుమారు రూ.80 కోట్లకు చేరుకున్నాయని పేర్కొంది. అయితే, బీఎస్ఎన్ఎల్కు చెల్లించాల్సిన అన్ని బకాయిలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా సంబంధిత శాఖలు, సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని కోరారు.