NTA: నీట్ పేపర్ లీక్ వివాదం, దేశవ్యాప్తంగా విద్యార్థులు , వారి తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర కీలక చర్యలకు ఉపక్రమించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఎన్టీఏలో 47 మంది అధికారుల్ని తొలగించారు. వారిలో కొందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే నెల రోజుల్లో ఎన్టీఏ పూర్తిస్థాయిలో మార్పులు చేయాలని నిర్ణయించింది. పరీక్ష నిర్వహణలో పారదర్శకత పెంచడం, పేపర్ లీక్కు అవకాశం లేకుండా చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యంగా చెబుతున్నారు.
ఎన్టీఏ అవుట్సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రశ్నాపత్రాల తయారీ, భద్రత, పంపిణీ ప్రక్రియలను మరింత కట్టుదిట్టం చేసి, లీక్లకు అవకాశం లేకుండా కొత్త విధానాలను అమలు చేయనున్నట్లు సమాచారం. ఎన్టీఏ పనితీరును సమీక్షించి, మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు నిపుణుల కమిటీ కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఎన్టీయే JEE, NEET, CUET సహా 20కిపైగా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తోంది.

