కనీస వేతనాలు పెంచాలంటూ నోయిడా కార్మికులు ఆందోళనకు దిగారు. డిమాండ్ల కోసం రోడ్డెక్కడం తప్పేమీ కాదు. కానీ నిరసనల పేరుతో విధ్వంసం సృష్టించడంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అవాక్కైంది. సోమవారం వేతనాల కోసం రోడ్డెక్కిన కార్మికులు.. కానీ అంతలోనే రణరంగంగా మారిపోయింది. ఆస్తులు ధ్వంసం చేయడం, వాహనాలు తగలబెట్టడం క్షణాల్లో తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయింది. పోలీసులు రంగం ప్రవేశం చేసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో పోలీస్ శాఖ షాక్కు గురైంది.

అయితే నోయిడా రణరంగంపై ప్రభుత్వం సీరియస్ అయింది. అయితే ఆందోళనలపై ఆరా తీయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కార్మికుల నిరసనల్లోకి బయట వ్యక్తులు ప్రవేశించినట్లుగా ప్రభుత్వానికి పోలీసులు నివేదించారు. నోయిడా ఘర్షణల వెనుక పాకిస్థాన్ ప్రమేయం ఉందని ఉత్తర ప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అనిల్ రాజ్భర్ ఆరోపించారు. పాకిస్థాన్ ప్రమేయంపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు.

ఇక నిన్నటి ఆందోళనల్లో ప్రమేయం ఉన్న 300 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో వంద మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే ఫ్యాక్టరీల్లో ఉన్న సీసీ కెమెరాలను, రహదారులపై ఉన్న కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. బయట వ్యక్తులు ఎలా ప్రవేశించారన్న దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఈ కుట్ర జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా కార్మికులకు యోగీ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. 21 శాతం కార్మికుల జీతాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయినా కూడా నేడు కూడా పలుచోట్ల కార్మికులు నిరసనలు కొనసాగిస్తున్నారు.