NTV Telugu Site icon

Bihar Politics: బీహార్ రాజకీయాల్లో సంచలనం.. సీఎం నితీష్‌ని గద్దె దింపేందుకు లాలూ ప్లాన్.?

Lalu Nitish

Lalu Nitish

Bihar Politics: బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అక్కడి ఆర్జేడీ-జేడీయూ ప్రభుత్వంలో ముసలం నెలకొంది. సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమి, ఆర్జేడీ పొత్తు నుంచి వైదొగాలని అనుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. మరోవైపు అధికారం చేజిక్కించుకునేందుకు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాట్నాలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కర్పూరీ ఠాకూర్‌కి మరణానంతరం కేంద్రం ‘భారతరత్న’ ప్రకటించడం, ఆ కార్యక్రమంలో ఆర్జేడీపై పరోక్షంగా సీఎం నితీష్ కుమార్ విమర్శించడం, ప్రధాని మోడీని ధన్యవాదాలు తెలపడం ఇలా ఒక్కొక్క సంఘటన నితీష్ కూటమి నుంచి బయటకు వెళ్తున్నట్లు చెప్పకనే చెబుతున్నాయి. ఇక లాలూ కుమర్తె రోహిణి ఆచార్య సీఎం నితీష్ కుమార్ టార్గెట్‌గా ట్వీట్స్ వివాదాన్ని మరింతగా పెంచింది.

ఇదిలా ఉంటే జేడీయూ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి చేరుతున్నట్లు, పాత మిత్రుడు బీజేపీకి నితీష్ దగ్గరవుతున్నట్లు గురువారం పరిణామాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బీహార్ బీజేపీ చీఫ్ సామ్రాట్ చౌదరి, కేంద్రమంత్రి అశ్విని చౌబే హుటాహుటిన అధిష్టానాన్ని కలిసేందుకు పాట్నా నుంచి ఢిల్లీ బయలుదేరడం ఆసక్తికరంగా మారింది.

Read Also: Breaking News: ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ అవుట్.. మళ్లీ బీజేపీతో జట్టు..?

అధికారం కోసం లాలూ ప్లాన్..?

మరోవైపు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసం వద్ద సందడి నెలకొంది. ప్రస్తుత పరిణామాలను చర్చించేందుకు జేడీయూ నాయకులు లాలన్ సింగ్, విజయ్ కుమార్ చౌదరి, ఇతర నాయకులు నితీష్ కుమార్‌తో భేటీ అయ్యారు. మరోవైపు లాలూ ప్రసాద్ యాదవ్ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. బీహార్ అసెంబ్లీలో మెజారిటీ మార్కును దాటేందుకు ఎమ్మెల్యేల సంఖ్యపై కసరత్తు చేస్తున్నట్లు సమచారం. బీహార్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ దాటేందుకు ఆర్జేడీకి 122 మంది ఎమ్మెల్యేలు అవసరంగా కాగా, ప్రస్తుతం 8 మంది ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు. అయితే బీహార్ మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ శిబిరంలోని నలుగరు ఎమ్మెల్యేలు, ఎంఐఎం నుంచి ఒకరు, మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఆర్జేడీలో చేరచ్చనే ప్రచారం జరుగుతోంది. అయినా కూడా ఆర్జేడీకి అధికారం కోసం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అవసరం. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం నితీష్ అసెంబ్లీని రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జేడీయూ పోటీ చేయవచ్చని తెలుస్తోంది.