కేరళను నిఫా వైరస్ వణికిస్తోంది. కోజికోడ్లో 12ఏళ్ల బాలుడు నిఫాతో మరణించినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. కేంద్రం కూడా ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపింది. నిపా వైరస్కు వైద్యం లేదు. ఇప్పటి వరకు అనుమతి పొందిన ఏ ఔషధం అందుబాటులోకి రాలేదు. మోనోక్లోనల్ యాంటీ బాడీస్ చికిత్స విధానం వినియోగించడంపై పరిశీలిస్తున్నారు. కాకపోతే ఇది వేగంగా వ్యాపించకపోవడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. మొత్తం కేరళలో ఇప్పటివరకు 19 మందికి వైరస్ సోకితే 17 మంది మరణించారు.కేరళలో కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. 25 వేలకు తగ్గకుండా కొత్త కేసులు వస్తున్నాయి. గత 24గంటల్లో 25వేల 772 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మృతుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. మరో 189 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతూ మరణించారు.రెండు వైరస్లతో ఏకకాలంలో పోరాటం చేస్తున్న కేరళ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వీకెండ్ లాక్డౌన్, నైట్ కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేయడం ఆందోళన కలిగిస్తోంది. అయితే వీక్లీ టెస్ట్ పాజిటివిటీ రేటు తగ్గడంతోనే లాక్డౌన్ ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకిటించింది కేరళ సర్కార్.