Amit Shah: ఢిల్లీకి రాష్ట్ర హోదాను ఇవ్వడాన్ని మొదటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూతోపాటు అప్పటి న్యాయ శాఖ మంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కూడా వ్యతిరేకించారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఢిల్లీ ఆర్డినెన్స్ పై చట్టం చేసే సమయంలో ప్రవేశ పెట్టిన బిల్లుపై లోక్సభలో అమిత్ షా మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు తమ కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించాలని హోం మంత్రి అమిత్ షా సూచించారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుపై జరుగుతోన్న చర్చలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జవహర్లాల్ నెహ్రూ, అంబేడ్కర్ వంటి నేతలు ఢిల్లీకి రాష్ట్ర హోదాను వ్యతిరేకించారన్నారు. ‘మీ కూటమిలో ఉన్నారన్న ఒక్క కారణం చేత, ఢిల్లీలో జరుగుతోన్న అవినీతికి మద్దతు పలకొద్దని అన్ని పార్టీలను కోరుతున్నాను. ఎందుకంటే ఈ కూటమి ఉన్నప్పటికీ.. ప్రధాని మోదీ రాబోయే ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో విజయం సాధిస్తారని వ్యాఖ్యానించారు.
Read also: Meera Chopra: అప్పుడు ఫిర్యాదు చేసిన బీజేపీకి పవన్ హీరోయిన్ మద్దతు
‘2015లో ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చింది. వారి ప్రధాన ఉద్దేశం ఘర్షణపడటమే. ఇక్కడ బదిలీల అంశం సమస్య కాదు. వారి బంగ్లాల నిర్మాణం వంటి వాటిల్లో జరుగుతోన్న అవినీతి దాచేందుకు విజిలెన్స్ విభాగాన్ని నియంత్రిస్తుండటమే అసలు సమస్య. 2015 ముందువరకు వివిధ ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఢిల్లీలోని పరిపాలన వ్యవహారాలు సజావుగా సాగాయి’ అని ఆప్పై అమిత్ షా విమర్శలు గుప్పించారు. జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లాభాయ్ పటేల్, సి. రాజగోపాల చారి, రాజేంద్ర ప్రసాద్, బీఆర్ అంబేడ్కర్ వంటి నేతలు కూడా ఢిల్లీకి పూర్తిస్థాయి హోదా ఇవ్వాలన్న ఆలోచనను వ్యతిరేకించారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాధికారులపై ఎవరి నియంత్రణ ఉండాలన్న విషయంపై గత కొన్నేళ్లుగా కేంద్రం, ఆప్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న న్యాయపోరాటంపై కొద్ది నెలల క్రితం ఆప్ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఐఏఎస్లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై ఢిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పు అనంతరం పరిపాలన సేవలపై నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్కు అప్పగించేలా కేంద్రం ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది. దాని స్థానంలో రూపొందించిన బిల్లును ఈ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. ‘ఢిల్లీకి సంబంధించి ఏ అంశంపైన అయినా పార్లమెంట్కు చట్టం చేసే అధికారం ఉందని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆ ఆర్డినెన్స్ వెల్లడిచేస్తోంది. ఢిల్లీకి సంబంధించి చట్టాలను రూపొందించేందుకు రాజ్యాంగంలోని నిబంధనలు అనుమతిస్తున్నాయని అమిత్ షా తెలిపారు.