NEET: జూన్ 21న జరుగనున్న NEET-UG 2026 రీ-టెస్ట్ కోసం భారత వైమానిక దళం (IAF) రంగంలోకి దిగింది. పేపర్ లీకేజీ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రశ్నాపత్రాలను సురక్షితంగా తరలించేందుకు Mi-17 హెలికాప్టర్లు, ఇతర వైమానిక వనరులను మోహరించనున్నట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రాలను నిర్ణీత 18 ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా ఉన్న పంపిణీ కేంద్రాలకు, పరీక్షా కేంద్రాలకు సకాలంలో సురక్షితంగా తరలించేందుకు ఐఎఎఫ్ సహకరించనున్నట్లు తెలుస్తోంది.
గతంలో పరీక్ష రద్దుకు దారితీసిన అక్రమాలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు విస్తృత భద్రతా ప్రణాళికలో భాగంగా ఈ చర్య చేపట్టారు. ప్రశ్నాపత్రాలను రూపొందించే నిపుణులు, మోడరేటర్లు, అనువాదకుల్ని ఇప్పటికే ఒక రహస్య ప్రదేశానికి తరలించారు. పరీక్ష పూర్తయ్యే వరకు వారంతా అక్కడే ఉండాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు లేకుండా వారిని ఉంచారు. ప్రశ్నా పత్రాల తయారీ నుంచి వాటి నిల్వ, రవాణా, పంపిణీ ప్రతీ దశను పర్యవేక్షించడానికి భద్రతా సంస్థలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అవసరమైతే అదనపు బలగాలను కూడా మోహరించేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇటీవల నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈకేసులో కీలక సూత్రధారుల్ని ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని నింపేందుకు ఈ పరీక్షను ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది. ప్రశ్నాపత్రాల భద్రత, పారదర్శకత, పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూసేందుకు అత్యంత కఠినమైన భద్రతా చర్యల్ని తీసుకున్నారు.

