8వ తరగతి పుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే పాఠ్యాంశం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఈ అంశంపై మరోసారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ సీరియస్ అయ్యారు. గురువారం ఈ కేసును సుమోటోగా ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్మల్య బాగ్చి, ఎం పంచోలి విచారించారు.
ఇది కూడా చదవండి: Modi-Netanyahu: వైరల్గా మారిన సారా నెతన్యాహు-మోడీ దుస్తులు.. ప్రత్యేకత ఇదే!
ఈ సందర్భంగా సూర్యకాంత్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థపై తూటా పేల్చారని.. న్యాయవ్యవస్థ అవినీతిమయమైందని ఉపాధ్యాయుల చేత విద్యార్థులకు బోధించాలని అనుకుంటున్నారా? అని నిలదీశారు. ఇది కచ్చితంగా న్యాయవ్యవస్థ ప్రతిష్టపై దాడిగా అభివర్ణించారు. న్యాయవ్యవస్థపై తూటా పేల్చడంతో సమానమని… ప్రస్తుతం మీడియాలో ‘‘రక్తసిక్తంగా’’ కనిపిస్తోందని.. ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయంగా పేర్కొన్నారు. పుస్తకం ఇప్పటికే మార్కెట్లో.. సోషల్ మీడియాలో అందుబాటులో ఉందని.. దీన్ని వెనక్కి తీసుకోవడం వల్ల ఎలా ప్రభావవంతంగా ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. న్యాయవ్యవస్థను చెడుగా చూపించి సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపుతున్నారని వ్యాఖ్యానించారు.
సూర్యకాంత్ వ్యాఖ్యలకు కేంద్రం, NCERT తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందించారు. ఈ అధ్యాయాన్ని రూపొందించిన ఇద్దరు వ్యక్తులు భవిష్యత్తులో ఏ మంత్రిత్వ శాఖతోనూ సంబంధం కలిగి ఉండరని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించిందని చెప్పారు. దీంతో డిజిటల్ మీడియా నుంచి వివాదాస్పద కంటెంట్ను తొలగించడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సంబంధిత మంత్రిత్వ శాఖకు తొలగింపు ఉత్తర్వులు జారీ చేసే చట్టబద్ధమైన అధికారం ఉందని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. పూర్తి దర్యాప్తు నిర్వహించబడుతుందని.. పూర్తి జవాబుదారీతనం ఏర్పడే వరకు చర్యలు నిలిపివేయబడవని కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి ప్రతికూల వైఖరిని తీసుకోదని.. కోర్టు సంతృప్తి చెందేలా చర్య తీసుకుంటుందని సొలిసిటర్ జనరల్ హామీ ఇచ్చారు.
అయినా ఈ అధ్యయం ఉద్దేశం న్యాయవ్యవస్థను కించపరడం కోసం కాదని.. న్యాయం ఆలస్యం అయినప్పుడు ప్రజలు న్యాయం కోల్పోతున్నారని పిల్లలకు అర్థం చేయించడమేనని తుషార్ మెహతా క్లారిటీ ఇచ్చారు. దీనికి సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ మాట్లాడుతూ.. కచ్చితంగా ఈ చర్య ఉద్దేశపూర్వకంగా జరిగినట్లు కనిపిస్తోందని.. కానీ కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి వివాదాస్పద విషయాలను డిజిటల్ ప్రసారం చేశారని.. ఇప్పుడు దీని తొలగింపు మరింత క్లిష్టంగా మారిందని ఎత్తి చూపారు.
ఈ అధ్యాయాన్ని పాఠ్యపుస్తకంలో చేర్చినందుకు ఎవరు బాధ్యత వహిస్తారో కోర్టు తెలుసుకోవాలనుకుంటుందని.. జవాబుదారీతనం కావాలని ప్రధాన న్యాయమూర్తి అడిగారు. పూర్తి నిజం వెల్లడయ్యే వరకు కోర్టు కేసును మూసివేయదని కూడా స్పష్టం చేశారు. విచారణ సందర్భంగా అవసరమైతే కోర్టు ధిక్కార చర్యలను కూడా పరిశీలించవచ్చని హెచ్చరించింది. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి, NCERT డైరెక్టర్కు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. ఈ అధ్యాయానికి బాధ్యులైన అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.
NCERT విచారం..
బుధవారం ‘న్యాయవ్యవస్థలో అవినీతి’’ అనే పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగానే NCERT విచారం వ్యక్తం చేసింది. 8వ తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థ అధ్యాయంపై చింతిస్తున్నట్లు పేర్కొంది. అనుచిత అంశాలను చేర్చడం వెనుక ఎలాంటి దురద్దేశం లేదని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) తెలిపింది. ముద్రించిన పుస్తకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ముద్రించిన 2.25 లక్షల కాపీలను గిడ్డంగికి తిరిగి పంపించినట్లు విద్యా మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. రాజ్యాంగ అక్షరాస్యత, సంస్థాగత గౌరవం, విద్యార్థుల్లో ప్రజాస్వామ్య భాగస్వామ్యంపై అవగాహన పెంచడమే కొత్త పాఠ్యపుస్తకాల లక్ష్యం అని తెలిపింది. అంతే తప్ప ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ‘‘ఏ రాజ్యాంగ సంస్థ అధికారాన్ని ప్రశ్నించే లేదా తగ్గించే ఉద్దేశ్యం లేదు.’’ అని చెప్పింది.
ఇది కూడా చదవండి: Arjun Tendulkar Wedding: జామ్నగర్లో అర్జున్ టెండూల్కర్ ప్రత్యేక వివాహ వేడుకలు.. వీడియో వైరల్