మధ్యప్రదేశ్కు చెందిన కొత్త జంట రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ గత నెల 23న మేఘాలయలో అదృశ్యమయ్యారు. మే 11న వివాహం చేసుకుని హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వచ్చారు. మూడు రోజుల తర్వాత తూర్పు ఖాసీ హిల్స్ కొండ ప్రాంతంలో అదృశ్యమయ్యారు. మే 23 నుంచి కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోవడంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. ఇక రంగంలోకి దిగిన మేఘాలయ పోలీసులు 10 రోజుల తర్వాత రాజా రఘువంశీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శరీరంపై గాయాలు ఉండటాన్ని బట్టి హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మృతదేహం దగ్గరే హత్యకు ఉపయోగించిన ఆయుధం, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. కానీ సోనమ్ ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. దీంతో ఆమె జాడ కోసం కూడా గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Trump: హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులకు వీసాలు నిషేధం
అయితే తాజాగా సోనమ్ మాట్లాడిన ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్గా మారింది. అదృశ్యానికి ముందు సోనమ్కు అత్త గారు ఫోన్ చేసింది. ‘‘ఎలా ఉన్నావు కూతురా?’’ అని అడిగింది. ‘‘నేను ఆహారం సిద్ధం చేస్తున్నాను. ఈ రోజు మీ ఉపవాసం అని నాకు గుర్తుంది. మీరు ఉపవాసం ఉన్నారా? గుర్తుందా? అని అడిగింది. దీనికి సోనమ్ బదులిస్తూ.. ‘‘అవును.. ప్రయాణం వల్ల నేను ఉపవాసం ఉండనని స్పష్టంగా చెప్పాను.’’ అని జవాబు ఇచ్చింది. తిరిగి అత్తగారు మాట్లాడుతూ.. కొంచెం ఆహారం తీసుకోండి అని సూచించింది. దీనికి సోనమ్ సమాధానం ఇస్తూ.. ప్రస్తుతం తాను ట్రెక్కింగ్ చేస్తున్నానని.. అడవిలో ఏం దొరకదని తెలిపింది. ఇది చాలా కఠినమైన ప్రయాణం అని.. నేను ఎక్కిన తర్వాత మీకు ఫోన్ చేస్తాను. ఎక్కడం నిటారుగా ఉంది. నేను అతనికి (రాజా) వెళ్లవద్దని చెప్పాను. కానీ అతను ఎప్పుడూ వినడు. నేను అలసిపోయాను. ఇక్కడ ఆహారం కూడా బాగా లేదు. నడుస్తున్నప్పుడు ఊపిరి పీల్చుకోవడం కష్టం.’’ అని సోనమ్ చెప్పింది. ఇలా రెండు నిమిషాల పాటు అత్తాకోడలి మధ్య సంభాషణ జరిగింది. ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ వైరల్గా మారింది.
మరో క్లిప్లో రాజా రఘువంశీ తన తల్లితో మాట్లాడుతుండటం వినిపించింది. ఇప్పుడే శిఖరానికి చేరుకున్నామని.. పండ్లు తింటున్నట్లు తల్లికి చెబుతాడు. అతని తల్లి.. మిస్ అవుతున్నానని అతనితో చెబుతుంది. ‘‘నువ్వు పర్వతం పైకి ఎందుకు వెళ్ళావు? వీడియో ఎందుకు షేర్ చేయలేదు?’’ అని తల్లి అడిగింది. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదని రాజా సమాధానమిస్తాడు. అప్పుడు అతని తల్లి.. ఎప్పుడు తిరిగి వస్తారని అడిగింది. దానికి అతను జవాబు ఇస్తూ.. రెండు రోజుల ప్రయాణం మాత్రమే మిగిలి ఉందని.. తర్వాత వస్తామని బదులిచ్చాడు
ఇది కూడా చదవండి: Andhra Pradesh: పర్యావరణ దినోత్సవం.. రాజధాని ప్రాంతంలో మొక్కలు నాటనున్న సీఎం, డిప్యూటీ సీఎం..
మధ్యప్రదేశ్కు చెందిన జంట రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీకి మే 11న వివాహం జరిగింది. హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. మే 23 నుంచి జంట ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు. తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో కనిపించకుండా పోయారు. సమాచారం అందిన దగ్గర నుంచి మేఘాలయ పోలీసులు, రెస్క్యూ సిబ్బంది జంట కోసం వెతికారు. ప్రతికూల వాతావరణంలో కూడా అధికారులు అన్వేషణ సాగించారు. ఎట్టకేలకు రియాట్ అర్లియాంగ్ దగ్గర లోతైన లోయలో రాజా రఘవంశీ మృతదేహాన్ని డ్రోన్ ద్వారా గుర్తించారు. రాజా రఘువంశీ మృతదేహాన్ని వీసావ్డాంగ్ పార్కింగ్ స్థలానికి తీసుకురాగానే కుటుంబ సభ్యులు, బంధువులు.. అతని కుడి చేతిపై ఉన్న ‘రాజా’ అని పేరున్న పచ్చబొట్టు ద్వారా గుర్తించారు. అయితే శరీరంపై గాయాలు ఉండడంతో హత్యకు పరిగణించారు. అయితే సోనమ్ ఏమైందన్న ఉత్కంఠ చోటుచేసుకుంది. ఆమెను చంపేశారా? లేదంటే కిడ్నాప్ చేశారా? అన్న విషయం తేలాల్సి ఉంది. ఇక నిందితుల కోసం కూడా గాలిస్తున్నారు.
ఇక రాజా రఘువంశీ మృతదేహం దగ్గర కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఒక మహిళ తెల్ల చొక్కా.. పెంట్రా 40 మందుల స్ట్రిప్, వివో మొబైల్, ఎల్సీడీ స్క్రీన్ భాగం, స్మార్ట్ వాచ్ స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వాహనం అద్దెకు తీసుకున్న 25 కిలోమీటర్ల దూరంలో రాజా మృతదేహం గుర్తించారని.. అంటే ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని ముందే ఆలోచించినట్లు సోదరుడు విపిన్ రఘువంశీ తెలిపారు. కొత్త జంట ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదని ముందు నుంచి చెబుతూనే ఉన్నట్లు చెప్పారు. కానీ తన వాదనను పోలీసులు పట్టించుకోలేదన్నారు. సీబీఐ దర్యాప్తు చేయాలని కోరారు. జంట ఆచూకీ చెబితే రూ.5లక్షల ఇస్తామని కుటుంబ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు.
ఇక ఈ ఘటనపై రాష్ట్ర పర్యాటక మంత్రి పాల్ లింగ్డో దిగ్ర్రాంతి వ్యక్తం చేశారు. దర్యాప్తు పూర్తయ్యేంత వరకు ప్రజలు ఓపిక పట్టాలని కోరారు. ఈ ఘటనతో షాక్ అయినట్లు చెప్పారు. గతంలో ఎప్పుడూ ఇలాంటివి జరగలేదన్నారు. పూర్తి వివరాలు తెలుసుకున్నాక.. మీడియాకు తెలియజేస్తామని చెప్పారు.