NTV Telugu Site icon

వైరల్: మొబైల్ చూస్తూ.. రైలు పట్టాలపై పడిన వ్యక్తి

కొందరికి మొబైల్ చేతిలో ఉంటే చాలు… వేరే లోకం అవసరం లేదు. మొబైల్ చూస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాలకు గురయ్యేవారు చాలా మందే ఉన్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. మొబైల్‌ ఫోన్‌ చూడటంలో పూర్తిగా బిజీ అయిన ఒక వ్యక్తి మెట్రో రైల్‌ పట్టాలపై పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే… ఈశాన్య ఢిల్లీలోని షాహదారా ప్రాంతానికి చెందిన 58 ఏళ్ల శైలేందర్ మెహతా శుక్రవారం మరో చోటకు వెళ్లేందుకు షాహదారా మెట్రో స్టేషన్‌కు వచ్చాడు. అయితే ఫ్లాట్‌ఫారంపై అటు ఇటు నడుస్తూ అతడు ఫోన్‌ చూడటంలో బిజీ అయ్యాడు. దీంతో గమనించకుండా ఫ్లాట్‌ఫారం అంచుకు వెళ్లి కింద ఉన్న రైలు పట్టాలపై పడ్డాడు.

మరోవైపు మెట్రో రైలు స్టేషన్‌లోకి వస్తుండటంతో… ఫోన్‌లో బిజీగా ఉండి పట్టాలపై పడిన శైలేందర్ మెహతా పైకి లేవలేకపోయాడు. గమనించిన సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన కానిస్టేబుల్ రోతాష్ చంద్ర వెంటనే అతడి వద్దకు చేరుకుని… శైలేందర్‌ను ఫ్లాట్‌ఫారంపైకి లాగారు. అనంతరం మెట్రో రైలు స్టేషన్‌లోకి వచ్చింది. కాగా ఈ ఘటన సీసీ టీవీలో రికార్డు అయ్యింది. దీంతో ఈ వీడియోను సీఐఎస్‌ఎఫ్‌ తన ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. మెట్రో రైలు పట్టాలపై పడిన సదరు వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపింది.