పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. విమర్శలు-ప్రతి విమర్శలతో నువ్వానేనా? అన్నట్టుగా సాగుతోంది.
ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, జమురియా అభ్యర్థి హరేరామ్ సింగ్ను మమతా బెనర్జీ హెచ్చరించారు. ప్రచార వేదికపై హరేరామ్ సింగ్ను ప్రజలకు పరిచయం చేస్తుండగా పబ్లిక్గా క్లాస్ తీసుకున్నారు. మీ కుమారుడు ఎర్ర బీకన్ వాహనం వాడకుండా ఆపాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇది ఎన్నికల సమయం జాగ్రత్తగా లేకపోతే.. పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయని వార్నింగ్ ఇచ్చారు. కుమారుడు పెద్ద కాన్వాయ్తో తిరుగుతున్నాడని వార్తలు రావడంతో బహిరంగ వేదిక నుంచి మమత హెచ్చరించారు. పార్టీలో క్రమశిక్షణే ముఖ్యమని.. నియమాలకు ఎవరూ అతీతులు కారని స్పష్టం చేసింది.
ఇక సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై టీఎంసీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. కేంద్రంలోనూ, 15 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందని.. చొరబాట్ల నివేదికలు వస్తున్న చాలా సరిహద్దు ప్రాంతాల్లో కూడా బీజేపీ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయని పేర్కొంది. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది.
