Maharashtra Temple Tragedy: మహారాష్ట్రలోని పర్భణి జిల్లా మానవత్ తహసీల్ పరిధిలో ఉన్న ప్రసిద్ధ యశ్వడి మారుతి ఆలయంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆలయం ముందు నిర్మించిన సభా మండపం అకస్మాత్తుగా కూలిపోవడంతో భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది. ప్రమాద సమయంలో ఆలయంలో మతపరమైన కార్యక్రమాలు, కీర్తనలు జరుగుతుండగా పెద్ద సంఖ్యలో భక్తులు మండపంలో ఉన్నారు. పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో సుమారు 30 నుంచి 40 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
పలువురికి తీవ్ర గాయాలు
ఈ ప్రమాదంలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆర్.పీ. ఆసుపత్రితో పాటు సమీపంలోని ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని తరలించేందుకు అంబులెన్సులను కూడా సిద్ధంగా ఉంచారు.
నిర్మాణ పనులపై అనుమానాలు
అయితే, ఘటనా స్థలం నుంచి వెలువడిన ఫోటోలు, వీడియోల ఆధారంగా మండపం నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని జిల్లా అధికారులు తెలిపారు. ఘటనా స్థలాన్ని బ్లాక్ చేసి సహాయక చర్యలను ముమ్మరం చేశారు.. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. హనుమాన్ ఆలయం ఉండటం, శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.. కార్యక్రమం జరుగుతుండగా, మండపం పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది. ఘటనా స్థలంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఉండడంతో.. ఆరుగురు మృతిచెందారు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.

