NTV Telugu Site icon

Maharashtra Budget: ముందుగానే ప్రజలకు ఎన్నికల తాయిలాలు.. బడ్జెట్ అంతా వరాలే

Bud

Bud

శుక్రవారం మహారాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భారీగా తాయిలాలు ప్రకటించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీగా నష్టపోయింది. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో డీలా పడింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలే లక్ష్యంగా బడ్జెట్ ప్రకటనలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది.

బడ్జెట్ ముఖ్యాంశాలు ఇవే..
‘‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్’’ పథకం కింద 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలకు నెలకు రూ.1,500 అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఇక 10 లక్షల మంది ఇంటర్న్‌లకు నెలకు రూ.10,000 స్టైఫండ్ అందించే పథకాన్ని కూడా ప్రకటించారు. పంట నష్టానికి పరిహారంగా చెల్లించాల్సిన గరిష్ట మొత్తం రూ. 50,000కి పెంచారు. ఆవు పాల రైతులకు లీటర్‌కు రూ.5 సబ్సిడీ ఇస్తామని వెల్లడించారు. అంతేకాకుండా 44 లక్షల మంది రైతులకు విద్యుత్ బిల్లు బకాయిలు మాఫీ చేస్తామని రాష్ట్ర అసెంబ్లీలో అజిత్ పవార్ ప్రకటించారు. దీంతో పాటు ముంబై ప్రాంతంలో పెట్రోల్‌పై పన్నును 26 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అంటే పెట్రోల్ ధరలు లీటరుకు 65 పైసలు తగ్గుతాయి. ఇక డీజిల్‌పై పన్నును 24 శాతం నుంచి 21 శాతానికి పన్ను తగ్గించారు. దీంతో ముంబై ప్రాంతంలో డీజిల్ ధర లీటర్‌కు రూ.2 తగ్గుతాయని ఆయన తెలిపారు.  అలాగే పేద కుటుంబాలకు ప్రతి సంవత్సరం మూడు ఉచిత ఎల్‌పిజి సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

అక్టోబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇంకోవైపు ఇండియా కూటమి నేతలకు కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. మరీ మహారాష్ట్ర ప్రజలు ఎవరికి అధికారం కట్టబెడతారో చూడాలి.