ముంబైలో ఎంతో ప్రసిద్ధి చెందిన వడాపావ్తో పాటు సమోసాలు, శీతల పానీయాలు, చాక్లెట్లు, ఐస్క్రీమ్ల విక్రయంపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల ప్రాంగణాల్లోనే కాకుండా.. స్కూల్ పరిసరాల్లో 50 మీటర్ల పరిధిలో కూడా జంక్ ఫుడ్ విక్రయాలు, పంపిణీ, ప్రకటనలను నిషేధిస్తూ మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అధిక కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్, చక్కెర కలిగిన ఆహార పదార్థాలను పాఠశాలల్లో విక్రయించడానికి లేదా పంపిణీ చేయడానికి అనుమతి ఉండదు. డీప్ ఫ్రై చేసిన వంటకాలు, చక్కెర అధికంగా ఉండే పానీయాలతో పాటు వడాపావ్, సమోసాలు, కూల్డ్రింక్స్, చాక్లెట్లు, ఐస్క్రీమ్లు తదితర ఆహార పదార్థాలు నిషేధిత జాబితాలో ఉన్నట్లు పేర్కొంది.
మహారాష్ట్ర ఎఫ్డీఏ కమిషనర్ తుకారాం ముండే మాట్లాడుతూ.. అధిక కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్, చక్కెర కలిగిన ఆహార పదార్థాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచడాన్ని నిరోధించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలు, వడాపావ్, సమోసాలు, కూల్డ్రింక్స్, చాక్లెట్లు, ఐస్క్రీమ్లను పాఠశాల ప్రాంగణాల్లో విక్రయించడానికి లేదా పంపిణీ చేయడానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పాఠశాలల నుంచి 50 మీటర్ల పరిధిలో కూడా వీటి ప్రకటనలను అనుమతించబోమని పేర్కొన్నారు.
ఈ నిబంధనలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యాలు కచ్చితంగా అమలు చేయాలని ముండే ఆదేశించారు. ఈ నిర్ణయంపై తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. నిషేధాన్ని అమలు చేసే బాధ్యత పూర్తిగా పాఠశాల యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు. నిబంధనలను పాటించని పాఠశాలలు, ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిబంధనల అమలును పరిశీలించేందుకు మహారాష్ట్ర వ్యాప్తంగా త్వరలో తనిఖీలు ప్రారంభించనున్నట్లు ఎఫ్డీఏ తెలిపింది. పాఠశాల యాజమాన్యాలతో కలిసి జిల్లా, తాలూకా స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, వర్క్షాప్లు నిర్వహించేందుకు కూడా అధికారులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కొత్త మార్గదర్శకాలను సజావుగా అమలు చేయడమే ఈ కార్యక్రమాల లక్ష్యమని పేర్కొన్నారు.

