లుధియానా కోర్టు పేలుళ్ల కేసులో…సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్. మాజీ కానిస్టేబుల్…తన మీద నమోదైన కేసుల ఫైళ్లను కాల్చేసేందుకే…ఈ కుట్రకు పాల్పడినట్లు విచారణలో తేలింది. గగన్ దీప్కు…డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
పంజాబ్లో కలకలం సృష్టించిన లుథియానా జిల్లా కోర్టులో బాంబు పేలుడు ఘటనలో ఆసక్తికర అంశాలు బయటపడుతున్నాయ్. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని.. 2019లో డిస్మిస్ అయిన హెడ్ కానిస్టేబుల్ గగన్దీప్ సింగ్గా గుర్తించారు. ఘటనాస్థలంలో మొబైల్ సిమ్కార్డు, వైర్లెస్ డోంగిల్ను స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా మృతుడిని గగన్దీప్ సింగ్గా నిర్దారించారు.
లుథియానాలోని ఖన్నా ప్రాంతానికి చెందిన గగన్దీప్ను మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో…2019లో విధుల నుంచి తొలగించారు. ఆ తర్వాత పోలీసులు అతడిని అరెస్టు చేశారు. రెండేళ్ల పాటు జైల్లో ఉన్న గగన్దీప్.. సెప్టెంబరులో బెయిల్పై విడుదలయ్యాడు. కేసు విచారణలో భాగంగా అతడు కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలోనే కేసు నుంచి బయటపడేందుకు అతడు ఈ కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కేసుకు సంబంధించిన పేపర్లను భద్రపరిచే కోర్టు రికార్డు గదిని బాంబుతో పేల్చేయాలని ప్రణాళిక చేసుకున్న గగన్దీప్.. వాష్రూంలో బాంబును అమర్చుతుండగా ఒక్కసారిగా అది పేలిపోయింది. పేలుడు ధాటికి అక్కడున్న నీటి పైపు పగిలిపోయింది. బాంబుకు సంబంధించిన కీలక భాగాలు ప్రవాహంలో కొట్టుకుపోవడంతో దర్యాప్తు క్లిష్టంగా మారిందని పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే పేలుడు పదార్థాలను గగన్దీప్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. నిందితుడి సోదరుడు, స్నేహితులను విచారిస్తున్నారు.