Lucknow Tragedy: లక్నో కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం.. 14 మంది సజీవ దహనం

  • లక్నో కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం
  • 14 మంది సజీవ దహనం
  • సంఘటనాస్థలిలో తీవ్ర విషాదఛాయలు
Up

Up

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అలీగంజ్‌లోని పురానియా ప్రాంతంలో ఓ కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దాదాపు 14 మంది సజీవ దహనం అయ్యారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. చాలా మంది ప్రాణాలు కాపాడుకొనేందుకు అంతస్తు పైనుంచి దూకేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు.

క్షణాల్లోనే భవనం మొత్తం పొగ, మంటలతో నిండిపోయినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అలాగే కొంత మందిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

×
×
Ad

ప్రాథమిక సమాచారం ప్రకారం.. బిల్డింగ్‌లో ఒక కోచింగ్ సెంటర్, ఒక లైబ్రరీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే భవనంలో కోచింగ్ సెంటర్ గానీ, లైబ్రరీ గానీ పనిచేయడం లేదని సీనియర్ పోలీసు అధికారులు స్పష్టం చేశారు. అధికారుల ప్రకారం… కింది అంతస్తులో పెంపుడు జంతువుల దుకాణం ఉండగా.. పై అంతస్తులో ఉద్యోగులు గేమింగ్ సాఫ్ట్‌వేర్‌పై పనిచేసే గేమింగ్ జోన్ ఉందని చెబుతున్నారు.

సీఎం యోగి ఆదేశాలు

అగ్నిప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే స్పందించారు. సంఘటన స్థలానికి అధికారులు తక్షణమే చేరుకోవాలని ఆదేశించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రకటనలో ‘‘రక్షణ చర్యలు వేగంగా కొనసాగాలి. గాయపడిన వారికి తక్షణ చికిత్స అందించాలి. అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలి.’’ అని సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు.

కారణాలపై దర్యాప్తు

ప్రస్తుతం మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకున్న అనంతరం అగ్నిమాపక శాఖ, పోలీసులు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నారు. అగ్నిప్రమాదానికి కారణమైన అంశాలు, జరిగిన నష్టం, భద్రతా లోపాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. సంఘటన స్థలంలో ఉన్నతాధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు.