సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్పై షూతో దాడికి యత్నించిన ఘటనను ప్రధాని మోడీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ సహా అన్ని రాజకీయ పార్టీల నేతలు ఖండించారు. కానీ కర్ణాటకకు చెందిన ఒక బీజేపీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి భాస్కర్ రావు మాత్రం.. దాడికి యత్నించిన న్యాయవాది ధైర్యాన్ని ప్రశంసించారు. న్యాయవాది ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందేనని వ్యాఖ్యానించారు.
భాస్కర్ రావు బెంగళూరు కమిషనర్గా పని చేశారు. ‘‘చట్టపరంగా తప్పు అయినప్పటికీ వయస్సుతో సంబంధం లేకుండా ఒక వైఖరి తీసుకుని దానికి అనుగుణంగా జీవించే మీ ధైర్యాన్ని నేను అభినందిస్తున్నాను.’’ అని ఎక్స్లో భాస్కర్ రావు రాశారు.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీ-కోల్కతా హైవేపై భారీ ట్రాఫిక్ జామ్.. 4 రోజులుగా నిలిచిపోయిన వందలాది వాహనాలు
అయితే బీజేపీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత మన్సూర్ ఖాన్ తప్పుపట్టారు. ‘‘చట్టప్రకారం తప్పు అయినప్పటికీ అతని ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారా?, మాజీ ఐపీఎస్ అయి ఉండి సిగ్గుచేటుగా లేదా?, ఒకప్పుడు మీరు చట్టాన్ని సమర్థించారు. ఇప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తిని అవమానించిన వ్యక్తికి మద్దతు ఇస్తున్నారు. ఇంది ఎంత పతనం.’’ అని భాస్కర్ రావుకు మన్సూర్ ఖాన్ కౌంటర్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Russia Ukraine Conflict: రష్యా సైన్యం తరపున పోరాడుతూ.. ఉక్రెయిన్ దళాలకు పట్టుబడ్డ భారతీయుడు..
దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సోమవారం అమానుష ఘటన చోటుచేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్పై ఓ వృద్ధ న్యాయవాది రాకేశ్ కిషోర్(71) ఊహించని రీతిలో షూ విసిరేందుకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది అడ్డుకుని కోర్టు వెలుపలకు లాక్కెళ్లిపోయారు. ఈ సందర్భంగా సనాతన ధర్మాన్ని రక్షించాలంటూ పదే పదే నినాదాలు చేశాడు. సనాతన ధర్మానాన్ని అవమానిస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశాడు. ఈ పరిణామంతో కోర్టు ప్రాంగణం అవాక్కైంది. ఇక ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని.. యథావిధిగా కార్యక్రమాలను గవాయ్ కొనసాగించారు.
గవాయ్పై దాడి యత్నాన్ని ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేసి ఖండించారు. ఇలాంటి దాడులను సహించబోమని మోడీ పేర్కొన్నారు. అలాగే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలు పార్టీల నేతలు ఖండించారు. ఇదిలా ఉంటే నిందితుడు రాకేష్ కిషోర్పై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు విడిచిపెట్టేశారు. 3 గంటల పాటు విచారించి వదిలిపెట్టేశారు. రాకేష్ కిషోర్ కోర్టు నంబర్- 1లోకి ప్రవేశించి గవాయ్ నేతృత్వంలోని బెంచ్పై షూ విసిరేందుకు ప్రయత్నించాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని బయటకు తీసుకెళ్లారు. దాడి సమయంలో ‘‘సనాతన్ కా అప్మాన్ నహీ సహేగా హిందుస్థాన్’’ అని నినాదాలు చేశాడు. మధ్యప్రదేశ్లోని ఖజురహోలోని జవారీ ఆలయంలో ఏడు అడుగుల పొడవున్న విష్ణువు విగ్రహం శిరచ్ఛేదం చేయబడిన నిర్మాణాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చుతూ సీజేఐ గవాయ్ నిర్ణయం తీసుకోవడంపై నిందితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
