తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు దక్షిణ మధ్య రైల్వే ఒక తీపి కబురు అందించింది. అస్సాం రాజధాని గౌహతి సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య నుంచి హైదరాబాద్లోని చర్లపల్లి టెర్మినల్ వరకు సరికొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాంలో ఈ రైలును ప్రారంభించారు.
సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు అభివృద్ధి చేసిన చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్కు ఈ రైలు రావడం విశేషం. వందే భారత్ రైళ్ల తరహాలోనే అత్యాధునిక సాంకేతికతతో.. తక్కువ ఖర్చుతో సామాన్యుల కోసం రూపొందించిన రైలే ఈ ‘అమృత్ భారత్’. ఈ రైలుకు రెండు వైపులా ఇంజన్లు ఉంటాయి. దీనివల్ల వేగం పుంజుకోవడం సులభం అవుతుంది.. ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది.
Also Read:Viral: కొత్తగా పెళ్లైన జంట.. బస్టాండ్లో భర్తను పకోడి తెమ్మని చెప్పి పరారైన భార్య..
ఇందులో కేవలం స్లీపర్ (Sleeper), జనరల్ సెకండ్ క్లాస్ (General) కోచ్లు మాత్రమే ఉంటాయి. తక్కువ ధరలో సుదూర ప్రయాణం చేసే వారికి ఇది వరం అని చెప్పవచ్చు. సెన్సార్ వాటర్ ట్యాప్స్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, మెరుగైన సీటింగ్, వెలుతురు వంటి ఆధునిక వసతులు ఇందులో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో స్టాపింగ్ పాయింట్లు ఇవే..
ఈ రైలు అస్సాం నుంచి బయలుదేరి పశ్చిమ బెంగాల్, ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ సాగుతుంది. మన రాష్ట్రాల్లో ప్రధానంగా శ్రీకాకుళం రోడ్, విజయనగరం జంక్షన్, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమహేంద్రవరం, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ రైల్వే స్టేషన్ ఆగుతుంది. ఆ తర్వాత అక్కడ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్కు చేరుతుంది.
Also Read:TG Crop Loan: పంట రుణాల పరిమితి ఖరారు.. ఒక్క ఎకరాకు ఎంత రుణం ఇస్తారంటే..
ప్రయాణికులకు కలిగే లాభం ఏంటి..?
ఏసీ ప్రయాణం భారం అనుకునే సామాన్యులకు, కూలీలకు, విద్యార్థులకు ఈ రైలు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రసిద్ధ శక్తి పీఠం కామాఖ్య అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులకు నేరుగా రైలు సౌకర్యం లభిస్తుంది. సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నగరం వెలుపల ఉన్న చర్లపల్లిలో దిగిపోవచ్చు. దీనివల్ల నగరంలోని ట్రాఫిక్లో చిక్కుకోకుండా త్వరగా గమ్యం చేరుకోవచ్చు. ఈ కొత్త రైలుతో ఈశాన్య భారతం , తెలుగు రాష్ట్రాల మధ్య వ్యాపార, పర్యాటక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.