NTV Telugu Site icon

Canada: జీ20లో ప్రెసిడెన్షియల్ సూట్ తిరస్కరించిన ట్రూడో.. ముందు నుంచే భారత్‌ని నిందించే ప్రయత్నం

Justin Trudeau

Justin Trudeau

Canada: ఇటీవల భారతదేశం ప్రతిష్టాత్మకంగా జీ20 సదస్సును నిర్వహించింది. సభ్యదేశాలతో పాటు ఆహ్వానిత దేశాలకు చెందిన అధినేతలు, అధికారులు మొత్తం 30 మందికిపైగా అగ్రనేతలు ఈ సమావేశాలకు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్, యూకే పీఏం రిషి సునాక్, చైనా ప్రీమియర్ లీ కియాంగ్ వంటి వారు హాజరయ్యారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఈ సమావేశాలకు హాజరయ్యారు. పలు దేశాలకు చెందిన అగ్రనేతలకు భారత్ మంచి ఆతిథ్యాన్ని ఇచ్చింది. లగ్జరీ హోటళ్లలో ప్రెసిడెన్షియల్ సూట్లను ఏర్పాటు చేసింది.

Read Also: Switzerland: అక్కడ బుర్ఖా వేసుకుంటే ఇకపై ఫైన్

అయితే కెనడా ప్రధాని ట్రూడో మాత్రం ఢిల్లీలోని లలిత్ లగ్జరీ హోటల్ లో ప్రెసిడెన్షియల్ సూట్ నిరాకరించినట్లు అధికారులు నివేదిక వెల్లడించింది. దీనికి బదులుగా సాధారణ రూంలోనే బస చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రతీ గ్లోబల్ లీడర్ కోసం ప్రెసిడెన్షియల్ సూట్లను భారత భద్రతా ఏజెన్సీలు ప్రత్యేకంగా రూపొందించాయి. ఇదిలా ఉంటే ఈ సమావేశంలో ప్రధాని మోడీ, ట్రూడో మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఖలిస్తాన్ సమస్య ప్రధాన ఎజెండాగా మారిందని తెలుస్తోంది. సమావేశం అనంతరం కెనడా బయలుదేరాల్సి ఉన్నా.. ట్రూడో విమానంలో సాంకేతిక లోపం కారణంగా కొన్ని రోజులు భారత్ లోనే ఉన్నారు. ఇండియా ఎయిర్ ఇండియా వన్ విమానాన్ని ఆఫర్ చేసినా తిరస్కరించారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఖలిస్తాన్ వివాదం ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీసింది. కెనడాకు వెళ్లగానే ట్రూడో సర్కార్, ఇండియా-కెనడా వాణిజ్య ఒప్పందాన్ని నిలిపేసినట్లు ప్రకటించింది. ఇదే కాకుండా ఆ దేశ ప్రధాని ట్రూడో అక్కడి పార్లమెంట్ లో మాట్లాడుతూ.. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ఇండియానే కారణమని ఆరోపించాడు. అంతే కాకుండా దేశంలోని భారత రాయబారిని బహిష్కరించారు. దీనికి ప్రతిగా ఇండియా కూడా తీవ్రంగానే స్పందించింది. కెనడియన్ దౌత్యవేత్తను భారత్ వదిలి వెళ్లాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే జీ20 సమావేశాలకు ముందే నిజ్జర్ హత్యపై భారత్ ని నిందించాలని కెనడా ప్రభుత్వం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలను కోరినట్లు సమాచారం. అయితే అందుకు ఆయా దేశాలు నిరాకరించినట్లు తెలుస్తోంది.