సైబర్ నేరగాళ్లు ఎవ్వరినీ వదలడం లేదు. అమాయకులైన ప్రజలకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. మరోవైపు మరి కొందరు.. రాజకీయ ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసి వివాదస్పద పోస్టులు పెడుతూ సంచలనం సృష్టిస్తున్నారు. అయితే తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా నిన్న హ్యాక్కు గురైంది. ఆయన ఖాతాను తమ అధీనంలోకి తీసుకున్న హ్యాకర్లు ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాకు క్రిప్టో కరెన్సీ ద్వారా విరాళాలు అందించాలని మొదట ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఉక్రెయిన్కు విరాళాలు ఇవ్వాలని కోరారు. అయితే, ఆ తర్వాత ఐదారు నిమిషాలకే ఆ ట్వీట్లు డిలీట్ అయ్యాయి.
నడ్డా ట్వీట్ హ్యాకింగ్కు గురికావడంపై బీజేపీ స్పందించి, నడ్డా ట్విట్టర్ ఖాతా కాసేపు హ్యాకింగ్కు గురైందని, అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే తిరిగి నియంత్రణలోకి వచ్చిందని పేర్కొంది. ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్పై కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్కు ఫిర్యాదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు.