ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని అంత్యక్రియలు జూలై 4 నుంచి ప్రారంభమై జూలై 9న ముగియనున్నాయి. వారం రోజుల పాటు జరిగే ఈ అంత్యక్రియలకు ప్రపంచ దేశాల నుంచి భారీ సంఖ్యలో తరలిరానున్నట్లు తెలుస్తోంది. దాదాపు 2 కోట్ల వరకు రావొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇక ఖమేనీ అంత్యక్రియలకు మిత్ర దేశాలను ఇరాన్ ఆహ్వానిస్తోంది. భారత్ నుంచి ఇప్పటికే ప్రధాని మోడీని ఆహ్వానించారు. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా గైర్హాజరవుతున్నారు. ఇక మోడీ తరపున బీహార్ గవర్నర్ వెళ్తున్నారు.
ఇదిలా ఉండగా ప్రధాని మోడీని కాకుండా భారత్లో అధికార-ప్రతిపక్ష పార్టీలను కూడా ఇరాన్ ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలను ఇరాన్ ఆహ్వానించింది. వర్గాల సమాచారం ప్రకారం.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ విదేశాంగ మంత్రి, కాంగ్రెస్ విదేశాంగ విభాగం చైర్మన్ సల్మాన్ ఖుర్షీద్లకు ఇరాన్ ఆహ్వానం పంపింది. అలాగే పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీకి కూడా ఆహ్వానం అందినట్లు సమాచారం. అయితే అంత్యక్రియలకు హాజరవుతారా లేదా అనే విషయంపై మల్లికార్జున ఖర్గే ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ తరఫున ఎవరు ప్రతినిధి బృందంలో పాల్గొనాలనే అంశంపై కూడా త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం పంపిన నేపథ్యంలో భారత్ అధికారిక ప్రతినిధి బృందాన్ని పంపాలని నిర్ణయించింది. ఈ బృందానికి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా నాయకత్వం వహించనున్నారు. ఆయనతో పాటు బిహార్ గవర్నర్ సయ్యద్ అటా హస్నైన్ కూడా భారత ప్రభుత్వ ప్రతినిధిగా అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.
ఇక ఖమేనీ అంత్యక్రియల కోసం టెహ్రాన్లో భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆయన భౌతికకాయాన్ని ముందుగా గ్రాండ్ మొసల్లాలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం పలు నగరాల్లో అంతిమయాత్ర నిర్వహించనున్నట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంత్యక్రియలకు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇది ఇరాన్ చరిత్రలోనే అతిపెద్ద ప్రభుత్వ అంత్యక్రియలుగా నిలిచే అవకాశముంది.
విదేశీ ప్రముఖుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఇరాన్ ఏర్పాటు చేసింది. దాదాపు 30 దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ఇటీవల జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల సమయంలో తమ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ యూరోపియన్ దేశాలకు మాత్రం ఆహ్వానం పంపలేదని ఇరాన్ స్పష్టం చేసింది.
జూలై 9న అంత్యక్రియలు పూర్తి
టెహ్రాన్లో జరిగే కార్యక్రమాల అనంతరం ఖమేనీ భౌతికకాయాన్ని ఇరాక్లోని నజఫ్, కర్బలా పవిత్ర ప్రాంతాలకు తీసుకెళ్లి.. చివరగా జూలై 9న మష్హద్లోని ఇమామ్ రేజా దర్గాలో ఖననం చేయనున్నట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఖమేనీ వారసుడిగా భావిస్తున్న ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ అంత్యక్రియల్లో బహిరంగంగా పాల్గొంటారా లేదా అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

