India’s GDP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025-26)లో భారత జీడీపీ 7.4 శాతం వృద్ధి చెందుతుందని, ఇది 2024-25లో 6.5 శాతంగా ఉన్న వృద్ధి కంటే ఎక్కువ అని కేంద్రం బుధవారం ముందస్తు అంచనాల్లో తెలిపింది. కేంద్రం విడుదల చేసిన ఈ గణాంకాలు ఇంట్రెస్టింగ్గా మారాయి. రష్యా నుంచి భారత్ చమురు కొంటున్న కారణంగా, యూఎస్ భారత్పై 50 శాతం సుంకాలను విధించింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారత జీడీపీ మెరుగైన వృద్ధిని సాధించింది.
Read Also: Trump: ప్రధాని మోడీ నన్ను ‘‘సార్’’ అన్నారు.. ట్రంప్ తాజా కామెంట్స్..
స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇప్లిమెంట్ మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంచనా వేయబడిన 7.3 శాతం రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ (GVA) వృద్ధి రేటులో సేవల రంగంలో మంచి వృద్ధి, జీడీపీ వృద్ధికి ప్రధాన కారణంగా ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉత్పత్తి, నిర్మాణ రంగాలు ఏడు శాతం వృద్ధి చెందుతాయని అంచనా వేయగా, వ్యవసాయం, విద్యుత్, నీటి సరఫరా వంటి యుటిలిటీ సేవల వృద్ధి మితంగా ఉంటాయని భావిస్తున్నారు.
ప్రస్తుత ధరల వద్ద ఉండే నామమాత్రపు జీడీపీ, ఈ ఏడాది 8 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసినట్లు మంత్రిత్వ శాఖ చెప్పింది. స్థిర ధరల వద్ద వాస్తవ జీడీపీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక అంచానాలు రూ. 187.97 లక్షల కోట్లతో పోలిస్తే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 201.9 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటుందని, దీంతో 7.4% వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా వేయబడింది. ప్రస్తుత ధరల వద్ద నామమాత్రపు జీడీపీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 330.68 లక్షల కోట్లతో పోలిస్తే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 357.14 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటుందని అంచనా వేయబడింది, ఇది 8% వృద్ధి రేటును చూపుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.