India-Sri Lanka: భారత్‌కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!

  • భారత్‌కు శ్రీలంక కీలక హామీ..
  • తమ భూభాగాన్ని వ్యతిరేక కార్యకలాపాలకు వాడనివ్వబోమని స్పష్టం
India Sri Lanka

India Sri Lanka

India-Sri Lanka: భారత్‌, శ్రీలంక మధ్య రక్షణ, సముద్ర భద్రతా సహకారం మరింత బలోపేతమవుతోంది. శ్రీలంక పర్యటనలో ఉన్న భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ భద్రత, సముద్ర భాగస్వామ్యం, రక్షణ సహకారంపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా భారత్‌ భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా తమ భూభాగాన్ని ఎలాంటి కార్యకలాపాలకు ఉపయోగించనివ్వబోమని దిసానాయకే స్పష్టం చేశారు. హిందూ మహాసముద్రంలో శ్రీలంకకు ఉన్న భౌగోళిక ప్రాధాన్యం నేపథ్యంలో ఈ హామీకి ప్రాధాన్యం సంతరించుకుంది. కీలక సముద్ర మార్గాలకు సమీపంలో ఉన్న శ్రీలంకతో సన్నిహిత రక్షణ భాగస్వామ్యం భారత్‌కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో రెండు దేశాలు రక్షణ రంగంలో సహకారాన్ని మరింత విస్తరించేందుకు మూడు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.

ఆరు L70 గన్ల ఆధునీకరణ

ఇరు దేశాల మధ్య కుదిరిన తాజా ఒప్పందాల్లో శ్రీలంక వైమానిక దళానికి చెందిన ఆరు L70 ఎయిర్‌ డిఫెన్స్‌ గన్లను ఆధునీకరించడం ప్రధానమైనది. భారత ప్రభుత్వ గ్రాంట్‌ కింద చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో శ్రీలంకలోని కీలక ప్రాంతాల వైమానిక రక్షణ సామర్థ్యం మెరుగుపడనుంది. ఈ ఆయుధాలను గతంలో భారత్‌ శ్రీలంక వైమానిక దళానికి అందించింది. అదే సమయంలో భారత్‌, శ్రీలంక నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజీల మధ్య విద్యా, శిక్షణ సహకారానికి మరో ఒప్పందం జరిగింది. అలాగే ఇరు దేశాల నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌ మధ్య సహకారాన్ని పెంచేందుకు అవగాహన ఒప్పందం కుదిరింది. దీనివల్ల యువ క్యాడెట్ల పరస్పర మార్పిడి కార్యక్రమాలకు మరింత ప్రోత్సాహం లభించనుంది.

సంక్షోభ సమయంలో భారత్‌ ‘ఫస్ట్‌ రెస్పాండర్‌’
రక్షణ సహకారంతో పాటు విపత్తుల సమయంలో పరస్పర సహాయం కూడా ఈ భాగస్వామ్యంలో కీలకంగా మారింది. ‘దిత్వా’ తుఫాన్‌ తర్వాత శ్రీలంకకు భారత్‌ అందించిన సహాయాన్ని దిసానాయకే గుర్తుచేసుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఆ టైంలో ‘ఆపరేషన్‌ సాగర్‌ బంధు’ ద్వారా సహాయక చర్యలు చేపట్టడంతో పాటు పునరావాస, పునర్నిర్మాణ కార్యక్రమాలకు భారత్‌ మద్దతు అందించింది. శ్రీలంకకు సహాయం చేయడం తమకు ఉపకారం కాదని, బాధ్యతగా భావిస్తున్నామని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ భారత్‌ ‘ఫస్ట్‌ రెస్పాండర్‌’గా అండగా ఉంటుందని తెలిపారు. ఇరు దేశాల సైనిక సంబంధాలు, సముద్ర భద్రత, విపత్తుల నిర్వహణ, శిక్షణ వంటి అంశాల్లో భాగస్వామ్యం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంకతో బలమైన రక్షణ, సముద్ర భాగస్వామ్యం భారత్‌ ‘నెయిబర్‌హుడ్‌ ఫస్ట్‌’ విధానంలో కీలకంగా మారుతోంది. హిందూ మహాసముద్రంలో ప్రాంతీయ శాంతి, భద్రతకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలనే సంకల్పాన్ని తాజా భేటీ మరోసారి స్పష్టం చేసింది.