పహల్గామ్ ఉగ్ర దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్లుగా భారత్ గుర్తించింది. లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలను దాయాది దేశం పెంచిపోషిస్తోంది. ఇక పహల్గామ్ ఉగ్ర దాడికి పాల్పడింది తామేనని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే వెనుకుండి లష్కరే తోయిబానే చేయించినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి.
తాజాగా పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్థాన్కు సంబంధించిన పాత్రను విదేశీ రాయబారులకు కేంద్ర ప్రభుత్వం ఆధారాలు చూపించింది. పాకిస్థాన్ మద్దతుతోనే ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని పేర్కొంది. దౌత్యవేత్తలకు విదేశాంగ శాఖ ఆధారాలు చూపించింది. ఆధారాలపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి దేశాలైన అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే స్పందించాయి. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నట్లు దేశాలు పేర్కొన్నాయి. తాజా ఆధారాలతో భవిష్యత్లో భారత్ ఏ చర్యలు తీసుకున్నా.. అభ్యంతరాలు రావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాక్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.
మంగళవారం పహల్గామ్లో ఉగ్రమూకల దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్దీ గాయపడ్డారు. ఈ ఘటనలో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారే ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటన తర్వాత భారత ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. పాకిస్థాన్పై కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే సింధు జలాలను నిలిపివేసింది. అంతేకాకుండా పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ-వాఘా సరిహద్దును మూసేసింది.