India Russia: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత ఇంధన భద్రత ప్రమాదంలో పడింది. యూఎస్ ఇజ్రాయిల్ ఇరాన్పై దాడి చేయడం గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలకు కారణమైంది. మరోవైపు అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రైయిన్, సౌదీ అరేబియాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘‘హార్మూజ్ జలసంధి’’ని ఇరాన్ మూసివేసింది. ప్రపంచంలో 20 శాతం చమురు రవాణా ఈ మార్గం గుండానే జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇరుకైన సముద్ర మార్గాన్ని ఇరాన్ మూసేయడంతో భారత్కు ఇబ్బందులు ఎదురవ్వబోతున్నాయి.
ఇదిలా ఉంటే, సంక్షోభ సమయాల్లో భారత్కు అండగా నిలిచే మిత్రదేశం రష్యా మరోసారి ముందుకు వచ్చింది. గల్ఫ్ ప్రాంతాల నుంచి చమురు రవాణాకు ఇబ్బంది ఎదురైతే తాము సరఫరా చేస్తామని రష్యా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత చమురు భద్రతకు హార్ముజ్ జలసంధి చాలా కీలకం. ప్రపంచ ఎల్ఎన్జీ సరఫరాలో దాదాపుగా 20 శాతం ఈ మార్గంపైనే ఆధారపడి ఉంది. భారత్ కు వచ్చే ముడి చమురు, ఎల్పీజీ దిగుమతుల్లో సుమారు సగం ఈ మార్గం గుండా వస్తుంది.
ప్రస్తుతం భారత్ కు తక్షణ సంక్షోభం లేదు. మన వద్ద ఉన్న 25 రోజుల ముడి చమురు, మరో 25 రోజుల పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయి. ఈ మొత్తం 50 రోజుల వినియోగానికి సరిపోతుంది. దేశీయ అవసరాలకు తగినంత నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారుగా భారత్ ఉంది. నాలుగో అతిపెద్ద రిఫైనింగ్ సామర్థ్యం భారత్ సొంతం. ఐదో అతిపెద్ద పెట్రోలియం ఎగుమతిదారుగా కూడా భారత్ ఉంది. గల్ఫ్ నుంచి పరిస్థితులు విషమిస్తే, రష్యా నుంచి దిగుమతి చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.