ఫస్ట్ వేవ్.. సెకండ్ వేవ్.. థర్డ్ వేవ్… వరుసగా మూడు కరోనా వేవ్లను చేశాం.. ఈ సమయంలో.. ఎన్నో వేరియంట్లు వెలుగు చూశాయి.. కొన్ని ప్రమాదకరంగా మారగా.. కొన్ని అంతగా ప్రభావాన్ని చూపలేకపోయాయి. అయితే, ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి తగ్గుతోన్న తరుణంలో… కొత్తరకం వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల బ్రిటన్లో వెలుగు చూసిన కొత్తరకం ఎక్స్ఈ వేరియంట్ భారత్లోనూ వెలుగుచూసింది. తొలి కేసు ముంబైలో నమోదైనట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. అంతేకాకుండా కప్పా వేరియంట్ నమోదైనట్లు తెలిపింది. ఈ కొత్త రకం వెలుగు చూసిన బాధితుల్లో… ఇప్పటి వరకు తీవ్ర లక్షణాలేవీ లేవని పేర్కొంది.
Read Also: Telangana: టీఆర్ఎస్ రాస్తారోకో, ధర్నాలకు అనుమతిలేదు.. స్పష్టం చేసిన ప్రభుత్వం
సాధారణ కోవిడ్ పరీక్షల్లో భాగంగా ముంబైకి చెందిన 230 మంది బాధితుల నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించారు. వీటిలో 228 మందిలో ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది. ఒకరిలో కప్పా, మరొకరిలో ఎక్స్ఈ బయటపడింది. మొత్తం 230 మందిలో 21మంది బాధితులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా, వీరిలో ఎవరికీ ఆక్సిజన్ అవసరం రాలేదు. ఆస్పత్రిలో చేరిన బాధితుల్లో 12 మంది వ్యాక్సిన్ తీసుకోని వారే ఉన్నారని చెబుతున్నారు అధికారులు.. అయితే, ఒమిక్రాన్ ఉప రకాలైన బీఏ.1, బీఏ.2ల మిశ్రమం ఉత్పరివర్తనంగా భావిస్తోన్న ఈ వేరియంట్… అధిక సాంక్రమికశక్తి కలిగివున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ వేరియంట్ వ్యాప్తి, తీవ్రతపై స్పష్టమైన ఆధారాలు లేవు. ఒమిక్రాన్లో ఇప్పటి వరకు ఉన్న ఇతర ఉత్పరివర్తనాల కంటే… దాదాపు 10శాతం ఎక్కువ వ్యాపించే గుణం ఉన్నట్లు బ్రిటన్ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. తాజాగా ఇది భారత్లోకి ప్రవేశించడంతో మరోసారి అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది కేంద్రం.. కోవిడ్ థర్డ్ వేవ్ ముగిసి.. క్రమంగా పాజిటివ్ కేసులు సంఖ్య దిగివచ్చిన తరుణంలో.. వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఇప్పుడు మళ్లీ టెన్షన్ పెడుతోంది.