Gas Pipeline: భారత్ సంక్షోభాలను అవకాశంగా మార్చుకుంటోంది. దేశ ఇంధన భద్రత కోసం భారీ ప్రాజెక్టుకు సిద్ధమైంది. అరేబియా సముద్రం గర్భంలో భారీ గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. హార్ముజ్ సంక్షోభం కారణంగా, ఈ ఇరుకైన సముద్ర మార్గంపై ఆధారపడకుండా నేరుగా గల్ఫ్ దేశాల నుంచి గ్యాస్ తెచ్చుకునేందుకు భారీ ప్రాజెక్టును చేపడుతోంది.
యూఏఈ- ఒమన్ నుంచి నేరుగా భారత్కు గ్యాస్ వచ్చే ప్రతిపాదిత ప్రాజెక్టుకు సుమారుగా రూ. 40,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. దీని నిర్మాణం పూర్తి కావడానికి ఐదు నుంచి ఏడేళ్లు పడుతుందని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన వర్గాలు చెబుతున్నాయి. ప్రైవేట్ కన్సార్టియం సౌత్ ఆసియా గ్యాస్ ఎంటర్ప్రైజ్ (SAGE) నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఒక నివేదికను సిద్ధం చేయమని ప్రభుత్వ రంగ సంస్థలైన GAIL, ఇంజనీర్స్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లను మంత్రిత్వ శాఖ కోరనున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ఏమిటి ఈ పైప్లైన్..?
యూఏఈ, ఒమన్ మీదుగా అరేబియా సముద్రం గుండా ఈ పైప్లైన్ వెల్తుంది. 2500 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ నిల్వులు ఉన్న ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్, తుర్క్మెనిస్తాన్, ఖతార్ నుంచి గ్యాస్ పొందేందుకు ఈ పైప్లైన్ భారతదేశానికి వీలు కల్పిస్తుంది.
సుమారుగా 3450 మీటర్ల లోతు వరకు ఈ పైప్ లైన్ ఉండొచ్చు. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన సముద్రగర్భ పైప్లైన్లలో ఒకటిగా నిలుస్తుంది. సముద్రగర్భ పరిస్థితుల్ని అంచనా వేయడానికి సేజ్ సంస్థ ఈ మార్గంలో రూ. 25 కోట్ల వ్యయంతో సుమారు 3000 మీటర్ల టెస్ట్ పైప్లైన్ వేసింది.
ఒక వేళ ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే హార్ముజ్ను పూర్తిగా బైపాస్ చేయవచ్చు. ట్యాంకర్ల అవసరం లేకుండా నేరుగా గ్యాస్ భారత్ చేరుతుంది. దీర్ఘకాలంలో గ్యాస్ చౌకగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికే యూఏఈ తన భూభాగం నుంచి ఒమన్ తీరం వరకు చమురు పైప్ లైన్ నిర్మాణం చేయాలని భావిస్తుంది. ఇదే జరిగితే హార్ముజ్ ద్వారా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒమన్ తీరం నుంచి చమురు ట్యాంకర్లు భారత్ చేరవచ్చు.
