ఎల్నినో ప్రభావమో.. లేదంటే ఇంకేంటో తెలియదు గానీ.. జూన్ నెల వర్షాలు లేకుండానే ముగిసిపోయింది. దేశంలో ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించి చాలా రోజులైనా.. ఏ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురవలేదు. ఆశ్చర్యం ఏంటంటే చాలా రాష్ట్రాలకు ఇంకా రుతుపవనాలు కూడా ప్రవేశించలేదు. ఇప్పటికీ దేశమంతా ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎల్నినో కారణంగా ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రంగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. వార్నింగ్ ఇచ్చినట్లుగానే వరుణుడు ముఖం చాటేశాడు. 1901 తర్వాత ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్ సృష్టించినట్లుగా అధికారులు తెలిపారు. దీంతో అన్నదాతలకు కన్నీళ్లే మిగిలేటట్టు కనిపిస్తున్నాయి.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆలస్య ప్రవేశం దేశవ్యాప్తంగా వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 1901 నుంచి వాతావరణ రికార్డులు నమోదు చేస్తున్న చరిత్రలో 2026 జూన్ నెల ఐదో అత్యంత పొడి జూన్గా నమోదైంది. సాధారణ సగటుతో పోలిస్తే జూన్ నెలలో 39.8 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది.
దశాబ్దంలోనే అత్యల్ప వర్షపాతం
గత పదేళ్లలో ఇదే అత్యంత తక్కువ జూన్ వర్షపాతంగా నమోదైంది. సాధారణంగా జూన్ నెలలో దేశవ్యాప్తంగా 165.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాలి. అయితే ఈసారి కేవలం 99.5 మిల్లీమీటర్ల వర్షమే కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీతో పోలిస్తే మూడు రోజుల ఆలస్యంగా కేరళలో ప్రవేశించాయి. అనంతరం పశ్చిమ భారతదేశంలోని ప్రధాన వ్యవసాయ ప్రాంతాల వైపు రుతుపవనాల పురోగతి దాదాపు రెండు వారాల పాటు నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా వర్షపాతం తీవ్రంగా తగ్గింది. ఇక వర్షాభావం కారణంగా ఖరీఫ్ పంటల సాగు పనులు మందగించాయి. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ వంటి పంటల విత్తనాల విత్తకం ఆలస్యమవుతోంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండుతున్న ఎండలు
ఇక వర్షాల లేమితో ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్కు పైగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. భారతదేశంలో ఏడాది మొత్తం కురిసే వర్షాల్లో దాదాపు 70 శాతం వర్షపాతం నైరుతి రుతుపవనాల ద్వారానే లభిస్తుంది. ఈ వర్షాలు దేశంలోని చెరువులు, జలాశయాలు, భూగర్భ జలాలను నింపడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
సుమారు 4 ట్రిలియన్ డాలర్ల భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ప్రధాన ఆధారంగా ఉండగా.. దేశంలోని దాదాపు సగం వ్యవసాయ భూమికి నీటిపారుదల సౌకర్యం లేదు. అలాగే దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. దీంతో రుతుపవనాల ఆలస్యం రైతులతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

