India Pakistan: భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం జీలం నదిలో నీటి మట్టాలు అకస్మాత్తుగా పెరిగాయని పాకిస్తాన్ మీడియా నివేదిస్తోంది. పాక్ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భారత్ వైపు నుంచి నీటిని విడుదల చేసినట్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముజఫరాబాద్లో జీలం నీటి మట్టం పెరిగినట్లు చెబుతున్నారు.
Read Also: Cars with high mileage: ఈ కార్లు రోజువారీ ప్రయాణానికి బెస్ట్.. మైలేజీలో తోపు
పీఓకే స్థానిక పరిపాలన అధికారులు హట్టియన్ బాలాలో నీటి అత్యవసర పరిస్థితిని విధించినట్లు తెలుస్తోంది. మసీదుల ద్వారా స్థానికులను హెచ్చరించినట్లు అక్కడి మీడియా చెబుతోంది. హట్టియన్ బాలా, ఘరి దుపట్ట, మజ్హోయ్, ముజఫరాబాద్లోని స్థానికులు నీటి మట్టం పెరుగుతున్నట్లు ధృవీకరించారు, జీలం నది వెంబడి నివసించే స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మసీదులలో హెచ్చరిక ప్రకటనలు జారీ చేశామని పేర్కొన్నారు. భారత్ లోని అనంత్నాగ్ నుంచి పీఓకేలోకి ప్రవేశించిన జీలం నది పీఓకేలోకి ప్రవేశిస్తుంది.
సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ ఇప్పటికే రద్దు చేసింది. దీనిపై పాక్ ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. నదీ జలాలను మళ్లించినా, అడ్డుకున్నా దీనిని ‘‘యుద్ధ చర్య’’గా భావిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే జీలం నదిలో వరదలు రావడం గమనార్హం. అయితే, పాక్ చేస్తున్న ఆరోపణల్ని ధ్రువీకరించాల్సిన అవసరం ఉంది.
భారతదేశం జల ఉగ్రవాదానికి పాల్పడుతోందని, అంతర్జాతీయ నదీ చట్టాలను ఉల్లంఘించిందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ముజఫరాబాద్లోని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (SDMA) ఆపరేషన్స్ డైరెక్టర్ ముజఫర్ రాజా, భారత ఆక్రమిత కాశ్మీర్లోని ఒక ఆనకట్ట నుండి నీటిని విడుదల చేసినట్లు ధృవీకరించారు. “విద్యుత్ ప్రాజెక్టు ఆనకట్ట యొక్క స్పిల్వేలు తెరవబడ్డాయి, ఫలితంగా ఒక మోస్తరు వరద పరిస్థితి ఏర్పడింది” అని ఆయన అన్నారు, స్థానిక నివాసితులు తమ భద్రత కోసం నదికి దూరంగా ఉండాలని కోరారు.