S-400 missile system: దేశ రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం భారీ డిఫెన్స్ కొనుగోళ్లకు ఓకే చెప్పింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) సమావేశంలో రూ. 2.38 లక్షల కోట్ల విలువైన రక్షణ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ కొనుగోలు భారత సైన్యానికి ఆధునిక సాంకేతిక సామర్థ్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం చెప్పింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్లను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ కొనుగోలు ఉండబోతోంది. భారీ కొనుగోలుకు సంబంధించిన విషయాన్ని రాజ్నాథ్ సింగ్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
భారత సైన్యం కోసం ఎయిర్ డిఫెన్స్ ట్రాక్డ్ సిస్టమ్, ఆర్మర్డ్ ఫియర్సింగ్ ట్యాంక్ మందుగుండు సామాగ్రి కొనుగోలు ద్వారా ట్యాంక్లపై దాడి సామర్థ్యం పెరుగుతుంది. హై కెపాసిటీ రేడియో రిలే, ధనుష్ గన్ సిస్టమ్, రన్ వే ఇండిపెండెంట్ సర్వైలెన్స్ సిస్టమ్స్కు ఆమోదం లభించింది. భారత కోస్ట్ గార్డు కోసం హెవీ డ్యూటీ ఎయిర్ కుషన్ వెహికిల్స్ కొనుగోలుకు డీఏసీ ఓకే చెప్పింది.
Read Also: Iran Israel Conflict: ‘‘థాంక్యూ ఇండియా’’ అని రాసి మరీ, ఇజ్రాయిల్ను కొడుతున్న ఇరాన్…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బలోపేతం కోసం పాతబడిన AN-32, IL-76 విమానాల స్థానంలో మిడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ కొనుగోలుకు ఆమోదం లభించింది. అలాగే శత్రదేశాల మిస్సైల్స్, విమానాలు, డ్రోన్లను అడ్డుకోవడం కోసం రష్యా నుంచి S-400 మిసైల్ వ్యవస్థ కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇది సమర్థవంతంగా పనిచేసింది. రిమోట్గా నియంత్రించే స్టైక్ డ్రోన్లను కొనుగోలు చేయనున్నారు. సుఖోయ్-30 విమానాల ఇంజన్ భాగాల అప్గ్రేడ్ కోసం అనుమతి లభించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే భారీ స్థాయిలో రక్షణ కొనుగోళ్లకు ఆమోదం లభించినట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మొత్తం రూ. 6.73 లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి. రూ. 2.28 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి.