India At UN: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA)లో దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి కాశ్మీర్ రాగం ఎత్తుకుంది. దీనికి ప్రతిగా యథావిధిగా భారత్ చేతిలో అవమానాన్ని ఎదుర్కోంది. జమ్మూ కాశ్మీర్ భారత్ అంతర్గత విషయమని, తప్పుడు మరియు కల్పిత కథనాలను వ్యాప్తి చేయడానికి పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికల్ని ఉపయోగించుకోవడం మానుకోవాలని హితవు పలికింది.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి భద్రతా మండలి సమర్పించి వార్షిక నివేదికపై జరిగిన చర్చ సమయంలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ జమ్మూ కాశ్మీర్ గురించి ప్రస్తావించడంతో వివాదం చెలరేగింది. దీనిపై భారత శాశ్వత ప్రతినిధి పర్వనేని హరీష్.. పాకిస్తాన్ వ్యాఖ్యలు అనవసరం, తప్పుదోవ పట్టించేవని పేర్కొన్నారు. పాకిస్తాన్ తన సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఐక్యరాజ్యసమితిని వేదికగా ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్ భారత్లో విడదీయలేని అంతర్భాగమని మరోసారి భారత్ స్పష్టం చేసింది.
పాకిస్తాన్ ఇలా అంతర్జాతీయ వేదికలపై జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తోంది. అన్ని సమయాల్లో భారత్ దీనిని తిప్పికొడుతోంది. పాకిస్తాన్ ముందుగా తన దేశంలో మానవహక్కులు, ఉగ్రవాద నిర్మూలనపై దృష్టిసారించాలని సూచించింది. కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాక్ ఆరోపిస్తోంది. అయితే, దీనికి ప్రతిగా భారత్ పాకిస్తాన్లోని బలూచిస్తాన్ అంశాన్ని ప్రస్తావించింది. మైనారిటీలపై జరుగుతున్న దాడులను గుర్తుచేసింది.

