పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో గ్యాస్ సంక్షోభం నెలకొంది. కానీ ఇప్పటి వరకు భారత్లో మాత్రం అలాంటి పరిస్థితులు రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం విస్తృతంగా తప్పుడు ప్రచారం సాగుతుంది. దీంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా ముందు జాగ్రత్తగా గ్యాస్ సిలిండర్లు భద్రం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది.
వంట గ్యాస్ సరఫరాపై తాజాగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. పెట్రోలియం-సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ.. గృహ వినియోగదారులకు వంద శాతం ఎల్పీజీ సరఫరా చేస్తామని… అన్ని రాష్ట్రాల్లో ఎల్పీజీ స్టాక్ ఉందని ప్రకటించారు. హర్మూజ్ దగ్గర భారత నౌకలన్నీ క్షేమంగానే ఉన్నాయని… శివాలిక్ నౌక ఈరోజు సాయంత్రం 5 గంటలకు భారత తీరానికి చేరుకుంటుందని తెలిపారు. శివాలిక్ నౌకలో 48 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉన్నట్లుగా వెల్లడించారు. ప్రస్తుతం ముడి చమురు తగినంత స్థాయిలో అందుబాటులో ఉందన్నారు. అన్ని శుద్ధి కర్మాగారాలు అత్యధిక సామర్థ్యంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఇక పెట్రోల్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని.. చమురు సమృద్ధిగా ఉందని పేర్కొన్నారు.
