Ebola outbreak: ఎబోలా వైరస్‌పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..

  • ఎబోలా వైరస్‌లో భారత్ అప్రమత్తం..
  • ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ వాయిదా..
Ebola Virus

Ebola Virus

Ebola outbreak: ఆఫ్రికా యూనియన్, భారత్ నిర్వహించాల్సిన కీలకమైన ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ వాయిదా పడింది. మే 28నే ఢిల్లీలో ఈ సమ్మిట్ జరగాల్సి ఉంది. అయితే, ఆఫ్రికా దేశాల్లో పెరుగుతున్న ‘‘ఎబోలా వైరస్’’ కేసుల కారణంగా భారత్ ఈ సమావేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. డెమెక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో దేశంలో కొత్తగా ఎబోలా కేసులు వెలుగులోకి రావడంతో ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర స్థితిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్, ఆఫ్రికన్ యూనియన్ చర్చల తర్వాత సమ్మిట్ వాయిదా పడింది.

ఆఫ్రికా ఆరోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేయడంతో పాటు అవసరమైన సహకారం అందించేందుకు రెండు పక్షాలు అంగీకరించినట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. భారత్‌లో ప్రస్తుతం ఎబోలా కేసులు నమోదు కాలేదు, అయినప్పటికీ కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్, క్వారంటైన్ విధానాలు, ల్యాబ్ టెస్టింగ్ వ్యవస్థల్ని బలోపేతం చేయాలని ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది.

ఈసారి ఆఫ్రికాలో వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ ‘‘బుండిబుగ్యో వేరియంట్’’గా గుర్తించారు. 2014-15లో భారీ ప్రాణనష్టానికి కారణమైన జైరే వేరియంట్ కన్నా కాస్త తక్కువ ప్రమాదకరం అయినప్పటికీ, వైరస్ కేసులు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతోనే భారత్ ఈ కీలక భేటీని తాత్కాలికంగా వాయిదా వేసింది. కొత్త తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ భారత్‌కు వ్యూహాత్మకంగా చాలా కీలకం. వాణిజ్యం, రక్షణ, ఆరోగ్యం, టెక్నాలజీ, మౌలిక సదుపాయాల వంటి కీలక రంగాల్లో ఒప్పందాలు జరిగేందుకు ఛాన్స్ ఉండేది.