IMD Warning: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో వర్షాలు

  • తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
  • ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
Imdalert

Imdalert

దేశంలో పలు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. అకస్మాత్తుగా సంభవించే తుఫానులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవడంతో అల్లాడిపోతున్నారు. తాజాగా శనివారం రాజస్థాన్‌లో ఇసుక తుఫాన్ హడలెత్తించింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.

ఇదిలా ఉంటే వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని వాయువ్య భారత ప్రాంతాలను వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ప్రభావితం చేస్తుందని భారత వాతావరణ శాఖ (IMD) ముందుగానే అంచనా వేసిందని ఐఎండీ శాస్త్రవేత్త అఖిల్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ ప్రభావంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయని పేర్కొన్నారు. గత రెండు నుంచి మూడు రోజులుగా మైదాన ప్రాంతాలు, తూర్పు భారతదేశం, మధ్య భారత ప్రాంతాల్లో నిరంతర ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని… దీంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు.

×
×
Ad

ఇక పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ఆయా వాతావరణ విభాగాలకు హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పుకొచ్చారు.

అదే విధంగా పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ హిమాలయ ప్రాంతాల్లో కూడా ఉరుములు, వడగళ్ల వానలు సంభవించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఇక దక్షిణ పశ్చిమ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అలాగే రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ, తమిళనాడు, లక్షద్వీప్‌లోని కొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు సాగనున్నట్లు అఖిల్ శ్రీవాస్తవ తెలిపారు.