Muslims vs RSS: ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకుడు దత్తాత్రేయ హోసబలే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిందూ మతం “సర్వోన్నతమైనది”.. భారతదేశంలోని ముస్లింలు కూడా పర్యావరణ పరిరక్షణ కోసం నదులు, సూర్యుడిని ఆరాధించాలని సూచించారు. అలాగే, ముస్లిం సోదరులు సూర్య నమస్కారం చేస్తే వారికి ఎలాంటి నష్టం జరగదని, అలా చేసినంత మాత్రాన మసీదుకు వెళ్లకుండా ఎవరు అడ్డుకోరని ఆయన అన్నారు. సూర్య నమస్కారం ఆరోగ్యానికి మేలు చేసే యోగ సాధనంగా అభివర్ణించారు. ప్రార్థనలు చేసే వారు ప్రాణాయామం చేయడంలో తప్పేముందని ప్రశ్నించిన ఆయన, నమాజ్ను వదిలేయమని చెప్పడం లేదన్నారు. ప్రతి ఒక్కరికీ తమ మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉంది.. మతాలకంటే ముందు “మానవ ధర్మం” ముఖ్యమని హోసబలే వ్యాఖ్యానించారు.
Read Also: Vicky Kaushal: శంభాజీ మహరాజ్ పాత్ర కోసం విక్కీ ఇంత త్యాగం చేశాడా.. !
కాగా, ఈ కార్యక్రమానికి బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ విభజన అంశాన్ని ప్రస్తావించిన హోసబలే.. పార్టిషన్ సమయంలో హిందువులకు ఏమి జరిగిందో అందరికీ తెలుసునని అన్నారు. అలాగే, హిందూ తత్వశాస్త్రంలో ప్రకృతి, జీవజాలంపై అహింసను బోధిస్తుంది, దేవతల పేర్లను పిల్లలకు పేర్లు పెట్టుకునే సంప్రదాయం భారతదేశానికి ప్రత్యేకమని చెప్పుకొచ్చారు. అయితే, “హిందూ మతం సర్వోన్నతమైనది” అనే వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఇవి ఒక మతాన్ని మరొక మతంపై ఆధిపత్యంగా చూపిస్తున్నాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, “మసీదుకు వెళ్లడాన్ని ఆపం” అనే వ్యాఖ్యల్లో ముస్లింలను హిందూ మెజారిటీ సంస్కృతిలో కలిపివేయాలనే భావన ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. హిందూ ఆచారాలను కేవలం మతపరమైనవిగా కాకుండా, ఆరోగ్యం, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ పేరుతో సామాన్యమైన పౌర సంస్కృతిగా చూపించాలని ఆర్ఆర్ ప్రయత్నిస్తుందని మరికొందరు విమర్శిస్తున్నారు.