Spring Season: భారతదేశంలో వసంతకాలం అదృశ్యమవుతోందా..? అంటే ఔననే సమాధానాలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా జరుగుతున్న వాతావరణ కారణాలు ఫిబ్రవరి నెలలో ఉష్ణోగ్రతల పెరుగుదలను ప్రేరేపిస్తున్నాయి. గత ఐదు దశాబ్ధాలుగా భారతదేశం తక్కువ శీతాకాలపు రోజులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు చూస్తోంది. పలు రాష్ట్రాల్లో, యూటీల్లో ఫిబ్రవరిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ ప్రకారం, ప్రపంచం రికార్డు స్థాయిలో వెచ్చని ఫిబ్రవరి మాసాన్ని అనుభవించాము.
సాధారణంగా ఫిబ్రవరిలో శీతాకాలం తర్వాత ప్రారంభమయ్యే వసంతకాలం, 1970 నుంచి ఉష్ణోగ్రత డేటాను పరిశీలిస్తే భారతదేశంలో కనుమరుగవుతోంది. గత ఐదు దశాబ్ధాల డేటా ప్రకారం.. ఫిబ్రవరి నెలలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను చూస్తున్నట్లు క్లైమేట్ సెంట్రల్ అధ్యయనం కనుగొంది. ఉదాహరణకు మణిపూర్లో అత్యధికంగా 2.5 డిగ్రీ సెల్సియన్ పెరిగింది, అలాగే ఢిల్లీలో 0.23 డిగ్రీల సెల్సియన్ అత్యల్పంగా నమోదైంది. బొగ్గు, చమురు, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాలు కాల్చడం ద్వారా భారతదేశంలో అన్ని సీజన్లలో వెచ్చని పరిస్థితులకు దారి తీసిందని క్లైమేట్ సెంట్రల్లోని క్లైమేట్ సైన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ పెర్షింగ్ అన్నారు.
డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రతీ ప్రాంతం నికరంగా వేడెక్కుతున్నట్లు అధ్యయనం కనుగొంది. దక్షిణాది రాష్ట్రాలు డిసెంబర్ మరియు జనవరిలో అత్యధిక పెరుగుదలను చూస్తు్న్నాయి. ఫిబ్రవరిలో వెచ్చగా మారుతోంది. ఫిబ్రవరిలో, రాజస్థాన్లో అత్యధిక ఉష్ణోగ్రతలు (2.6 డిగ్రీ C) నమోదయ్యాయి, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడఖ్ మరియు జమ్మూ & కాశ్మీర్లలో 2 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. ఇలా ఉష్ణోగ్రతలు ఫిబ్రవరిలో పెరగడం, మార్చి మధ్యలో ఉండే ఉష్ణోగ్రతలను చూపిస్తోంది, ఇది వృక్ష సంపదపై ప్రభావం చూపుతోంది. పంటలకు పక్వానికి తగినంత సమయం లేకపోవడంతో ఆహార ఉత్పత్తి దెబ్బతింటుంది. ఇంటర్గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) యొక్క 6వ నివేదిక యొక్క రెండవ విడత ప్రకారం, 1-4 ° C ఉష్ణోగ్రత పెరుగుదల దక్షిణ ఆసియాలో మొక్కజొన్న ఉత్పత్తిని 25-70% మరియు వరి ఉత్పత్తిని 10-30% తగ్గించవచ్చు.
రుతుపవనాలకు ముందు వసంత రుతువు వేడెక్కడం చాలా వేగంగా సంభవిస్తోంది. దీని వల్ల భారత్ అంతటా వేసవి-ఉష్ణోగ్రతలు ముందుగా ప్రారంభమవుతున్నాయి. మానవ కార్యకలాపాల నుంచి వేగంగా పెరుగుతున్న వాతావరణ మార్పలు సాధారణ కాలానుగుణ విధానాలకు అంతరాయం కలిగిస్తున్నాయి. కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ (C3S) గత నెలలో ప్రపంచంలోనే అత్యంత వెచ్చని ఫిబ్రవరిని అనుభవించిందని పేర్కొంది, సగటు ఉష్ణోగ్రత 1850-1900 ఫిబ్రవరి సగటు కంటే 1.77 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంది. ఇది పారిశ్రామిక పూర్వ స్థితి కన్నా ఎక్కువ. జనవరి నెలలో మొదటిసారిగా మొత్తం సంవత్సరానికి గ్లోబల్ సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీ సెల్సియస్ థ్రెషోల్డ్ని ఉల్లంఘించిందని ఫిబ్రవరిలో C3S తెలిపింది. పారిస్ ఒప్పందం ప్రకారం 1.5-డిగ్రీ సెల్సియస్ పరిమితిని శాశ్వతంగా ఉల్లంఘిస్తే, ఇది అనేక సంవత్సరాలుగా వేడెక్కడాన్ని సూచిస్తుంది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక పూర్వ కాలం కంటే 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రపంచాన్ని హెచ్చరించారు.