NTV Telugu Site icon

Teesta Setalvad: వెంటనే లొంగిపోవాలి తీస్తా సెతల్వాడ్‌కి హైకోర్టు ఆదేశం.. గుజరాత్ అల్లర్ల కేసులో కుట్ర..

Teesta Setalvad

Teesta Setalvad

Teesta Setalvad: 2002 గుజరాత్ అల్లర్ల కేసులో కల్పిత సాక్ష్యాలను సృష్టించడం, పలువురుని కేసులో ఇరికించేందుకు కుట్ర చేసిన కేసులో ప్రముఖ హక్కుల నేత తీస్తా సెలత్వాడ్ నిందితురాలిగా ఉన్నారు. తాజాగా ఈ కేసులో ఆమెను వెంటనే లొంగిపోవాలని, బెయిల్ తిరస్కరిస్తూ గుజరాత్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శనివారం వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. గతేడాది సెప్టెంబరులో ఆమెకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఇప్పటివరకు ఆమెను అరెస్టు చేయలేదు.

సుప్రీంకోర్డును ఆశ్రయించే ఉత్తర్వులపై స్టే విధించాలన్న ఆమె తరుపు న్యాయవాది అభ్యర్థను గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చింది. గుజరాత్ లో 2002 అల్లర్ల విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి(సిట్)కి తప్పుడు సమాచారం, సాక్ష్యాలు ఇచ్చారనే అభియోగాలపై ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసులో అమాయకులను ఇరికించే కుట్ర పన్నారని ప్రధాన అభియోగం. గతంలో ఈ కేసులో తీస్తా సెతల్వాడ్ ను గుజరాత్ యాంటీ టెర్రర్ స్వ్కాడ్(ఏటీఎస్) ముంబాయిలో అరెస్ట్ చేసింది.

Read Also: Morphing photos: వివాహిత ఫొటోలు మార్ఫింగ్.. భర్తకు పంపించిన ఓ దుర్మార్గుడు.. !

రెండు నెలల పాటు జైలులో ఉన్న ఈమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ సెషన్స్ కోర్టు, గుజరాత్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చాయి. అయితే దీనిపై తీస్తా సెతల్వాడ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గతేడాది సెప్టెంబర్ లో విచారించిన సుప్రీంకోర్టు ఆమెకు మధ్యంత బెయిల్ ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు సాధారణ బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరుపున న్యాయవాది గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా.. ఆమె అభ్యర్థనను తిరస్కరించిన న్యాయస్థానం లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది.

కల్పిత సాక్ష్యాలు, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర వంటి ఆరోపణలపై తీస్తా సెతల్వాద్, మాజీ పోలీసు అధికారి ఆర్‌బి శ్రీకుమార్‌లను అరెస్టు చేశారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తర్వాత తీస్తా సెప్టెంబర్ 2022లో గుజరాత్‌లోని సబర్మతి జైలు నుండి విడుదలయ్యారు. సాక్షుల తప్పుడు వాంగ్మూలాలను తీస్తా సెతల్వాద్ రూపొందించారని, అల్లర్లపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన నానావతి కమిషన్‌ ముందు దాఖలు చేశారని గుజరాత్‌ ఏటీఎస్‌ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ పేర్కొంది. ఎఫ్ఐఆర్ ప్రకారం, సెతల్వాద్ మరియు శ్రీకుమార్ తప్పుడు సాక్ష్యాలను కల్పించడం ద్వారా మరియు అమాయకులపై తప్పుడు మరియు దురుద్దేశపూరితమైన క్రిమినల్ ప్రొసీడింగ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడానికి కుట్ర పన్నారనే అభియోగాలు ఉన్నాయి.