Rahul Gandhi: ‘‘పాకిస్తాన్‌కి సమాచారం ఇవ్వడం నేరం’’.. ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ గాంధీ..

  • పాకిస్తాన్‌కి ఆపరేషన్ ముందు సమాచారం ఇవ్వడం నేరం..
  • ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ గాంధీ ఆరోపణలు..
  • జైశంకర్ వీడియోని ట్వీట్ చేసిన ప్రతిపక్ష నేత..
  • తప్పుడు ఆరోపణల్ని ఖండించిన విదేశాంగ శాఖ..
Rahulgandhi

Rahulgandhi

Rahul Gandhi: పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆపరేషన్‌కి ముందే భారత్ పాకిస్తాన్‌కి సమాచారం ఇచ్చిందని, ఇది నేరం అని ఆయన విమర్శించారు. దీనికి ధీటుగా బీజేపీ బదులిస్తూ, రాహుల్ గాంధీ నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తున్నాడని ఆరోపించింది.

శనివారం, రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా విదేశాంగ మంత్రి జైశంకర్‌కి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేశారు. దీనిలో విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. ‘‘మే 6-7 తేదీల మధ్య రాత్రి నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ ప్రారంభంలో, ఉగ్రవాద స్థావరాలను మాత్రమే దాడి చేశామని, సైనిక స్థావరాలపై కాదు అని పాకిస్తాన్‌కి సందేశం పంపబడింది. వారు మా సలహా తీసుకోలేదు.’’ అని చెప్పడం వినవచ్చు.

Read Also: Rajasthan High Court: సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేట కేసులో కీలక అప్‌డేట్

రాహుల్ గాంధీ ఈ వీడియోపై స్పందిస్తూ, దాడికి ముందు పాక్‌కి సమాచారం ఇవ్వడం నేరం అని అన్నారు. ప్రభుత్వం అలా చేసిందని విదేశాంగ మంత్రి బహిరంగంగా అంగీకరించారు అని ఆరోపించారు. ఉగ్రవాద స్థావరాలపై దాడి సందర్భంగా భారత వైమానిక దళం ఎన్ని వీడియోలను కోల్పోయింది .? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అయితే, రాహుల్ గాంధీ ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ కూడా స్పందించింది. పాకిస్తాన్‌కి సమాచారం ఇచ్చామని చెప్పడం తప్పుడు ప్రకటన అని చెప్పింది.

బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మాట్లాడుతూ, ఆయన నకిలీ వార్తల్ని వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. జైశంకర్ ఆపరేషన్ సిందూర్‌లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన తర్వాత, పాకిస్తాన్ ఆర్మీ భారత్‌పై దాడులు చేయడాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలు ఆపరేషన్ సిందూర్‌కి ముందే చేసినట్లు తప్పుగా చిత్రీకరిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.